ప్రజాసమస్యలపై బీజేపీ పోరుబాట 

BJP Party Fights Against People Problems In Telangana - Sakshi

నేటి నుంచి సెప్టెంబరు చివరి నాటికి 18 రకాల నిరసన కార్యక్రమాలు 

పార్టీ పదాధికారుల సమావేశంలో నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు తెలపాలని, ఉద్యమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ వివిధ ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అధ్యక్షతన ఆదివారం బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబరు నెలాఖరు నాటికి రోజుకో కార్యక్రమం చొప్పున 18 కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

నేటి నుంచి చేపట్టబోయే కార్యాచరణ 
► ఆగస్టు 31: వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కిసాన్‌ మోర్చా అధ్వర్యంలో వ్యవసాయ కమిషనర్‌కు వినతిపత్రం. ప్రైవేట్‌ టీచర్లు, కాలేజీ లెక్చరర్ల సమస్యలపై యువమోర్చా ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం. 
► సెప్టెంబర్‌ 1: పార్టీ జిల్లా శాఖల ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు. 
► 2న: తెలంగాణ విమోచనం కోసం బలిదానమైన అమరవీరులకు పరకాలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ శ్రద్ధాంజలి ఘటిస్తారు.  
► 3న: ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు వసూలు చేస్తున్న అధిక ఫీజులపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వినతిపత్రం 
► 3, 4 తేదీల్లో: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్‌ 17న అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ విమోచన పోరాటాన్ని పాఠ్యాంశంగా చేయాలని, పోరాటం జరిగిన స్థలాలను స్మృతి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్లకు వినతిపత్రాలు. 
► 4న: కరోనాను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు  
► 5న: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు 
► 6న: తెలంగాణ విమోచన దినోత్సవంపై రాష్ట్రస్థాయిలో కళాకారుల సమావేశం నిర్వహణ. 
► 7న: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్‌కు విన్నవించడం 
► 8న: తెలంగాణ విమోచన దినోత్సవంపై రాష్ట్రస్థాయిలో మేధావులతో సమావేశం నిర్వహణ  
► 11న: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిరసన కార్యక్రమాలు 
► 12, 13 తేదీల్లో: కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సందర్శన 
► 17న ఉదయం: ప్రతి పోలింగ్‌ బూత్‌లో జాతీయజెండా          ఎగురవేయాలి  
► 17న సాయంత్రం: తెలంగాణ విమోచన దినోత్సవంపై బహిరంగ ర్యాలీ (వర్చువల్‌ ర్యాలీ) 
► 21న: గోదావరి నది జలాలపై రాష్ట్ర స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం 
► 25న: పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రతి పోలింగ్‌ బూత్‌లో కనీసం 10 మొక్కలు నాటాలి. 
► సెప్టెంబర్‌ చివరి నాటికి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన విధంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి రాష్ట్రంలో 100 రైతు ఉత్పత్తి సంఘాలు(ఎఫ్‌పీవో) ఏర్పాటు కోసం కార్యాచరణ.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top