
సాక్షి, తిరుపతి: కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవదేవుని ఆలయంలో సాంప్రదాయానికి ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. సాంప్రదాయానికి తూట్లు పొడవటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నిస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేద పారాయణానికి తూట్లు పొడవటానికి సిద్ధమవుతున్నారు. వేదమంటే బ్రహ్మదేవుని వాక్కు. కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు. వేద పారాయణదారుల మీద వేదం వద్దని ఒత్తిడి చేస్తున్నారు. వేదం ఎవరికి అర్థం కాదని ప్రచారం చేస్తున్నారు. వేదాలను వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం. కూటమి పాలనలో మన పూర్వీకులను అధికారులు అవమానిస్తున్నారు’’ అని భూమన ధ్వజమెతారు.
‘‘శాసనాలు చెదిరినా వాక్కు ద్వారా వచ్చిన వేదం మరిచిపోలేదు. వేద పండితులు మన సనాతన, వేద వారసత్వాన్ని కాపాడుతున్నారు. వేదమంటే మన భారతీయ సంస్కృతి. ఓ అధికారి అధికార గర్వంతో వేదాలను అవమానిస్తున్నారు. ఆ అధికారి అధికార గర్వాన్ని అడ్డుకోవాలి. మన హిందూ జాతి మేల్కోవాలి. వేదాలను కాపాడుకోవాలి. నేను రాజకీయం చేయడం లేదు.. మన వేదాలను కాపాడుకోవాలి’’ అని భూమన పిలుపునిచ్చారు.
‘‘ఏడు యజర్వేదాలు ఏడు కొండలయ్యాయని వేదాలు చెబుతున్నాయి. శ్రీవారి కొలువులో నాలుగు వేద పఠనాలు సాగుతుంటాయి. చతుర్ముఖ బ్రహ్మ నాలుగు వేదాలు స్వామి వారి కోసం పారాయణం చేస్తారు. స్వామివారి సేవలో వేదాలు పఠిస్తుంటారు. వేల సంవత్సరాలుగా వేద పఠనం జరుగుతోంది. టీటీడీ చాలా చోట్ల వేద పాఠశాలలు నిర్వహిస్తుంది.
..వైఎస్సార్ వేద విశ్వ విద్యాలయాన్న నెలకొల్పారు. పీవీఆర్కే ప్రసాద్ రాసిన పుస్తకాన్ని ఆ అధికారి చదవాలి. వేద పారాయణం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 700 పోస్టులు సృష్టించింది. మేం ఓడిన తర్వాత ఆ పోస్ట్లు ఏమయ్యాయో తెలియదు. వేదాలపై కామెంట్ ఆ అధికారి స్కంద పురాణం చదవాలి. చంద్రబాబు అనుమతి లేకుండా ఆ అధికారి మాట్లాడుతారా అనే అనుమానం ఉంది’’ అని భూమన కరుణాకర్రెడ్డి వ్యాఖ్యానించారు.