సమైక్య పోరుకు ఒక్కటైన 30 రిజిస్టర్డ్ సంఘాలు
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలతో కూటమి ప్రభుత్వం విభజించు – పాలించు అనే విధానం అనుసరిస్తుండడంతో రిజిస్టర్డ్ సంఘాలు ఒక్కటయ్యాయి. ఉపాధ్యాయ సమస్యలపై ఉమ్మడిగా పోరు సాగించేందుకు నిర్ణయించాయి. ఇప్పటికే గుర్తింపు సంఘాలు ఫ్యాప్టోగా ఏర్పడి పోరుబాట ప్రారంభించగా, ఇకపై రిజిస్టర్డ్ సంఘాలు సైతం ఐక్యంగా ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ తెలిపారు.
శుక్రవారం విజయవాడలో రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల సమావేశం నిర్వహించారు. మొత్తం 30 సంఘాలతో ఐక్యవేదికను ఏర్పాటు చేసినట్లు సీవీ ప్రసాద్ ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని సంఘాలు ఏకమై సమస్యల పరిష్కారం కోసం జతకట్టడం ఇదే మొదటిసారి అని ఆయన తెలిపారు. గతేడాది ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రభుత్వం కేవలం గుర్తింపు సంఘాలతోనే చర్చలు జరపడం, రిజిస్టర్డ్ సంఘాలను పిలవకపోవడాన్ని ఐక్యవేదిక ఖండిస్తున్నట్టు వెల్లడించారు. విద్యారంగం, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం, పీఆర్సీ, ఐఆర్, డీఏ, పాత బకాయిలు, ఇతర ఆరి్థకపరమైన డిమాండ్ల సాధన కోసం త్వరలో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
రూసో రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
సమావేశంలో భాగంగా రిజిస్టర్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ (రూసో)ను ఏర్పాటు చేసి రాష్ట్ర కమిటీని ప్రకటించారు. చైర్మన్గా సీవీ ప్రసాద్ (ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు), ప్రధాన కార్యదర్శిగా ఎస్.శ్రీనివాసరావు(పీఎంటీఎఫ్), కోశాధికారిగా ఎం.మీరయ్య(ఏపీ పీజీటీఏ), కో–చైర్పర్సన్లుగా ఎస్.రాజేశ్వరి (మహిళా ఉపాధ్యాయ సంఘం), ఆర్.సుధాకర్ రెడ్డి (ఎస్టీయూడీ), అన్నం శ్రీనివాస్ (పూలే టీచర్స్ ఫెడరేషన్), ఖాజా రహమతుల్లా (ఆర్టీఏ), ఎం.అమర్నాథ్ (ఏటీఏ), కె.పూర్ణచంద్రనాయక్ (ఏపీ టీడబ్ల్యూటీఏ), శ్రీనివాసులు (పీఎస్ హెచ్ఎంఏ), డిప్యూటీ సెక్రటరీ జనరల్స్గా డి.పెంచలయ్య (మహాజన టీచర్స్ అసోసియేషన్), గణేష్ (దివ్యాంగుల టీచర్స్ అసోసియేషన్), లక్ష్మణ్ (ఏపీ జీటీడబ్ల్యూఏ ఎస్సీఆర్టీఏ), పారయ్య (టీఆర్ఈఐటీఎల్ఏ), సు«దీర్ (ఏపీపీడీఏ), వెంకట సుబ్బయ్య (స్పెషల్ ఎడ్యుకేటర్స్ అసోసియేషన్), మహిళా కార్యదర్శులుగా గంగాభవానీ (వోజీవీటీ)తో పాటు 20 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. టీఎన్యూఎస్ ఏపీ రాష్ట్ర నాయకుడు కృష్ణ మోహన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.


