నల్లగొండ జిల్లాకు చుక్కనీరు తెచ్చారా? | Bhatti Vikramarka in Kondamallepalli corner meeting | Sakshi
Sakshi News home page

నల్లగొండ జిల్లాకు చుక్కనీరు తెచ్చారా?

Jun 12 2023 1:10 AM | Updated on Jun 12 2023 1:10 AM

Bhatti Vikramarka in Kondamallepalli corner meeting - Sakshi

కొండమల్లేపల్లి: ‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు దేని కోసం.. నల్లగొండ జిల్లాకు చుక్క నీరు తెచ్చారా.. లేదా పెద్ద ప్రాజెక్టు కట్టారా’అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ఆదివారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి మండలంలో కొనసాగింది. సాయంత్ర కొండమల్లేపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో భట్టి మాట్లాడారు.

నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తొమ్మిదేళ్లుగా రూ.వెయ్యి కోట్లు తీసుకురాని దుర్మార్గులు ఈ బీఆర్‌ఎస్‌ పాలకులని విమర్శించారు. ఆనాడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం దగ్గరికి వెళ్లి సమీక్షలు చేసి 70 శాతం వరకు పనులు పూర్తి చేయించారని.. మంత్రి అంటే పని చేయించే కోమటిరెడ్డిలా ఉండాలని వ్యాఖ్యానించారు. జగదీశ్‌రెడ్డి ఒక్కరోజు కూడా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్దకు వెళ్లలేదని,  సమీక్షలు చేయకుండా దిష్టి»ొమ్మగా ఉన్నారని విమర్శించారు. 

భట్టిని విమర్శించే స్థాయి మంత్రి జగదీశ్‌రెడ్డికి లేదు.. 
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల కోసం భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుంటే స్వార్థం కోసం పాదయాత్ర చేస్తున్నాడని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. భట్టి విక్రమార్కను విమర్శించే స్థాయి జిల్లా మంత్రికి లేదన్నారు. నల్లగొండలో ప్రియాంకగాం«దీతో సభ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

గుమ్మడవెల్లిలో పైలాన్‌ ఆవిష్కరణ 
భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చేరుకోవడంతో ఆదివారం వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.. కాగా భట్టి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో ఆయనను కలుసుకునేందుకు భార్య నందిని, కుమారుడు సిద్ధు ఇక్కడికి వచ్చారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement