
సాక్షి,అమరావతి: అసెంబ్లీ ఎన్నికలు వస్తుంటే రాజకీయ పార్టీలతో పొత్తుల కోసం వెంపర్లాడటం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అవసరం అయితే పొత్తులు పెట్టుకోవడం, అవసరం తీరాక దూషణలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం సచివాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు.
గత ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాయన్నారు. ఆ తర్వాత మిత్రపక్షంపైనే ఆరోపణలు చేసి బయటకు వచి్చన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు చేస్తున్నది మోసమని అన్నారు. పొత్తులపై వైఎస్సార్సీపీకి స్పష్టమైన విధానం ఉందన్నారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
పొత్తుల వెనుక రహస్యం..
చంద్రబాబు పొత్తుల కోసం వెళ్లారా? కేసుల విషయంలో ఎక్కడ ఇరుక్కుంటాననే భయంతో వెళ్లారా? ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉన్నాయో తెలీదు. పొత్తులపై వైఎస్సార్సీపీకి మొదటి నుంచి క్లారిటీ ఉంది. స్పష్టమైన విధానం ఉంది. ప్రజలకు పార్టీ అజెండా స్పష్టంగా తెలియజేయాలి. అప్పుడే ప్రజలు ఏ పార్టీ బాగుంటుంది, ఏ కూటమి బాగుంటుంది అనేది నిర్ణయించుకుంటారు. పొత్తులనేవి ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలి, అధికారం ఎలా చేతుల్లోకి తీసుకోవాలి అనేది ఉన్నంత వరకే ఉంటాయి. ప్రజలు మోసపోతారు. ఇందులో అత్యంత సిద్ధహస్తుడు, రికార్డులు బ్రేక్ చేసిన వ్యక్తి చంద్రబాబు.
ఆయన ముఖ్యమంత్రి కావటానికి ఎంతమందినైనా లోబరుచుకొని, వారి దగ్గర రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తారు. దివంగత ఎన్టీఆర్ను టీడీపీ నుంచి తప్పించి పార్టీని చేతుల్లోకి తీసుకొన్నప్పటి నుంచి బాబు ప్రతి ఎన్నికల్లో ఇలాగే చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కొక్కటి చేస్తారు. దీనికి ఆయన నిర్వచనం ఎత్తులు, వ్యూహం అంటారు. ఇవి ప్రజాస్వామ్యానికి అవసరమని చెబుతాడు. నిజంగా ఈ విధానం రోగ లక్షణం. జనసేన అనేది బాబు కంట్రోల్లో నడుస్తుంది. 2019 ఎన్నికల్లో వ్యతిరేక ఓటు చీలాలనుకున్నారు కాబట్టి పక్కకు తప్పించారు. బీజేపీతో ఉండి వద్దనుకున్నాక నాలుగు విమర్శలు చేసి బాబు బయటకు వచ్చారు. మళ్లీ ఇప్పుడు బాబు పొత్తుల కోసం
ప్రయత్నిస్తున్నారు.
ఎందుకు భయం?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో ఆదరణ లేదని బాబు భావిస్తున్నప్పుడు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అనుకోవటం దేనికి? ఇద్దరు కలిస్తే 50 శాతం ఓట్లు ఉన్నట్లే కదా? ఇది సరిపోతుంది కాదా? వారు అనుకొన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు బదిలీ కాదు. కానీ, వైఎస్సార్సీపీకి 80 శాతం ప్రజా మద్దతు ఉంది. వీరంతా కట్టకట్టుకొని వచ్చినా సీఎం జగన్కి సీట్లు పెరుగుతాయి. ఓటింగ్ పర్సంటేజీ పెరుగుతుంది. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం.
రాష్ట్రం, కేంద్రం మధ్య ఉన్నవి సుహృద్భావ సంబంధాలే
ఏపీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య ఉండాల్సిన సుహృద్భావ సంబంధాలు మాత్రమే ఉన్నాయి. బీజేపీకి, వైఎస్సార్సీపీకి సంబంధం లేదు. సీఎం జగన్కు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరేవీ లేవు. ప్రజలను తాకట్టుపెట్టి మరేదో సంపాదించాలని అనుకోరు. వైఎస్సార్సీపీ గురించి కేంద్రానికి క్లారిటీ ఉంది. అందుకే కేంద్రంలో ఎవరు ఉన్నా సీఎం జగన్ను గౌరవిస్తారు. బాబు చివరికి వచ్చారు. బాబు అనుకున్న రీతిలో లోకేశ్ ఎదగలేదు. లోకేశ్ను ముందుకు తీసుకు వచ్చేందుకు ఇది ఆఖరి అవకాశం కాబట్టే బాబు ఇన్ని కుయుక్తులు పన్నుతున్నారు.
చదవండి: బీర్ల లోడు నేలపాలు.. సీసాల కోసం జనం పాట్లు