కోల్సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనర ల్ ఆస్పత్రి (జీజీహెచ్) ఆవరణలో పేరుకపోయిన వ్యర్థాలను తొలగించారు. ‘అస్తవ్యస్తంగా సర్కార్ ఆస్పత్రి’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆస్పత్రి యంత్రాంగం స్పందించింది. మెడికల్ సూపరింటెండెంట్ హిమబిందు సింగ్ ఆదేశాల మేరకు సోమవారం సీఎంవో డాక్టర్ అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. వ్యర్థాలు, పాత పరుపులు, చెత్తను జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో తొలగించారు. భవన ం పైభాగంలో డ్రెయినేజీ పైపుల లీకేజీ, ఎస్టీపీ గుంత సమస్యలపై సంబంధిత ఇంజినీర్లతో సూపరింటెండెంట్, ఆర్ఎంవో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జీజీహెచ్ను తనిఖీ చేసిన మేయర్
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులపై ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన మేయర్ మహంకాళి స్వామి ఆకస్మికంగా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలో నిల్వ ఉన్న మురుగు నీరు, చెత్తకుప్పలు, పెరిగిపోయి న పొదలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్టీపీ నిర్మాణం కోసం మూడేళ్ల క్రితం తవ్విన గుంతను పూర్తి చేయకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేశారని ప్రశ్నించారు. ఎస్టీపీ సమస్యపై ఎమ్మెల్యే ఎంఎస్. రాజ్ఠాకూర్తో చర్చించి పరిష్కారానికి కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. ఈ తనిఖీలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ సాగి సంతోష్రావు, ఆసుపత్రి ఆర్ఎంవో కృపాభాయ్, సీఎంవో అప్పారావు పాల్గొన్నారు.


