రామగుండం: అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామానికి చెందిన గోపు అయిలయ్య యాదవ్ తన ఐదేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయారు. అప్పట్నుంచే కష్టాన్ని నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో చదువుకున్నారు. ఉపాధి, కుటుంబ బాధ్యతలు సమన్వయం చేస్తూ పారిశ్రామికవేత్తగా, కాంట్రాక్టర్గా ఎదిగారు. కాంట్రాక్టరుగా తన జీవితంలో 1990ల్లోనే విజయవాడ బస్టాండ్ నిర్మాణం చెప్పుకోదగ్గ విషయమని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. అంతేకాదు.. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో రూ.3 కోట్ల వ్యయంతో తన భాగస్వామ్యంతో, గోపు వంశీయుల సహకారంతో శ్రీమల్లికార్జునస్వామి ఆలయం నిర్మించారు. గత ఫిబ్రవరి 27, 28వ తేదీల్లో కుటుంబసమేతంగా దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు నిర్వహించి తన తండ్రి ఆశయం నెరవేర్చారు.


