పెద్దపల్లి: జిల్లాలో స్వచ్ఛ గావ్, సురక్షిత జలవాయు కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ గావ్, సురక్షిత జలవాయు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈనెల 5వ తేదీ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. తొలివిడతలో 150, రెండోవిడతలో 305 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్కార్డులు మంజూరు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మూడో విడతలో మరింతమందికి వచ్చేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, ఐజేయూ – టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర సంపత్ కుమార్, డీపీఆర్వో జగన్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు నారాయణదాసు అశోక్, కుమార్ యా దవ్, రంజిత్ కుమార్, అంకరి ప్రకాశ్, హాకిం, మోహన్, కుమార్ తదితరులుపాల్గొన్నారు.
ప్రభుత్వ సందేశం ప్రతీఇంటికి చేరాలి
జ్యోతినగర్/పెద్దపల్లి: జిల్లాలో నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సందేశం ప్రతీ ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఎన్టీపీసీలో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక– 99 రోజుల కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం అందిస్తుందని, ఇందుకోసం ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం, మరణధ్రవీకరణ పత్రం ఉండాలని ఆయన పేర్కొన్నారు. తక్కువ వర్షపాతం పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు, నీటి నిర్వహణ, విద్యుత్ రంగ అవసరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్పై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతీశుక్రవారం చేపట్టే డ్రైడేలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని అన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, ఏసీపీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


