ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రూ.90,859 తలసరి ఆదాయంతో రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉండేది. 2013–14లో ఉమ్మడి రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం రూ.85,797 ఉండగా, నేడు పెద్దపల్లి రూ.2,31,766, కరీంనగర్ రూ.2,22,628, రాజన్న సిరిసిల్ల రూ.1,95,479, జగిత్యాల రూ.1,83,094గా నమోదైంది. పదేళ్లలో ఈ ప్రాంతాల తలసరి ఆదాయం సుమారు 2నుంచి 2.5 రెట్లు పెరిగింది.
ఉమ్మడి రాష్ట్రంలో 9లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం కలిగి ఉండేది. ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న, కందులు, పెసలు పండించేవారు. స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ వల్ల సాగునీరు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కరీంనగర్లో 3,31,252 ఎకరాలు, పెద్దపల్లిలో 2,83,876 ఎకరాలు, జగిత్యాలలో 3,74,645 ఎకరాలు, సిరిసిల్లలో 2,43,292 ఎకరాలు సాగవుతున్నాయి. మొత్తంగా 12లక్షల ఎకరాలు సాగవుతుంది. నీటి వసతి పెరగటంతో 20శాతం నుంచి 35శాతం వరకు సాగు విస్తీర్ణం పెరిగింది.
స్వరాష్ట్రంలో పరిపాలన విక్రేందీకరణతో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి జిల్లా కాస్తా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలుగా మారాయి. 57 మండలాలు ప్రస్తుతం 61 మండలాలుగా విస్తరించాయి. ఐదు రెవెన్యూ డివిజన్లు 9 రెవెన్యూ డివిజన్లుగా, 6 మున్సిపాలిటీలుండగా, మరో 8 కొత్తగా ఏర్పడ్డాయి. ప్రతి జిల్లాలో కొత్తగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి.
ఉమ్మడి రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ సేవల కోసం హైదరాబాద్ లేదా వరంగల్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఉమ్మడి జిల్లాకు కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి ప్రధాన ఆధారంగా ఉండేది. స్వరాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా మెడికల్ కాలేజీల ఏర్పాటు, జిల్లా ఆసుపత్రుల అప్గ్రేడేషన్, మాతాశిశు సంరక్షణ కేంద్రాలు, డయాలసిస్ కేంద్రాల విస్తరణ, ఐసీయూ, ఎన్ఐసీయూ, పీఐసీయూ సేవల పెంపు, ఆరోగ్య శ్రీసేవల విస్తరణ, పల్లెదవాఖానాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది.


