పెద్దపల్లి: ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్యభవన ఆవరణలో నిర్వహించిన శ్రీవాసవీ మాత జయంతి వేడుకల్లో పాల్గొని ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తమ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి వాసవీమాత జయంతిని ప్రభుత్వపరంగా నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈసందర్భంగా విజయరమణారావును ఆర్యవైశ్యులు సన్మానించారు. కార్యక్రమంలో వాసవీమాత ఆలయ చైర్మన్ చకిలం మారుతి, ఆర్యవైశ్య సంఘం పట్టణ గౌరవ అధ్యక్షుడు రామ్మూర్తి, అధ్యక్షుడు భాస్కర్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ కమిషనర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


