కాల్వశ్రీరాంపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు లోప భూయిష్ట నిర్మాణ పనులతో కుంగిపోవడం నిజం కాదా? అని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజ యరమణారావు ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్, హరీ శ్రావులు బహిరంగ చర్చకు సిద్ధమా.. అని సవాల్ విసిరారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టు తీర్పు పై బీఆర్ఎస్ నాయకులు జబ్బలు చరుసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని కోర్టు ఎక్కడా తప్పు పట్టలేదన్నారు. కమిటీ రిపోర్టు వాస్తవాలు, అవాస్తవాలు గ్రహించామని కేసీఆర్, హరీశ్రావులను ఇప్పుడే అరెస్టు చేయకండని తీర్పు ఇచ్చిందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలో బుంగలు పడింది నిజం కాదా అని అడిగారు. మెదక్ జిల్లా కోసం మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టుకుని ఇక్కడ నీళ్లను తీసుకుపోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ష ట్టర్లు మరమ్మతు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హ యాంలో శ్రీపాద, ఎల్లంపల్లి, కడెం, మిడ్మానేరు, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించిందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయించాలని కోరారు. తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రా రైస్ కాదంటూ మెలిక పెట్టడం ఇక్కడి రైతులకు అన్యాయం చేయడమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నివేదిక ఇచ్చారని దీనిపై సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో మంత్రి మండలిలో చర్చించనున్నట్లు తెలిపారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, సర్పంచులు బంగారి రమేశ్, మనోహర్రావు, శ్రీనివాస్, సింగిల్విండో మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.


