గంగాధర: ఆ తల్లిదండ్రులు 25 ఎకరాల ఆస్తి సంపాదించారు. ఐదుగురు కొడుకులను పెంచి పెద్ద చేసే క్రమంలో అవసరాని కి ఐదెకరాలు అమ్మారు. భర్త చనిపోగానే 20 ఎకరాలు కొడుకులకు పంచింది. తనకు చేతనైన పని చేసుకుంటూ బతికింది. ప్రస్తుతం మంచానికి పరిమితం కాగా, కొడుకులు పట్టించుకోక పోవడంతో తనకు న్యాయం చేయండని పోలీసులను వేడుకుంటుంది. వివరాలు.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధి పానుగంటిపల్లి గ్రామానికి చెందిన కుంట కిష్టయ్య–నంబవ్వ దంపతులకు ఐదుగురు కుమారులు. రెండో కుమారుడు మృతిచెందాడు. 18 ఏళ్ల క్రితం భర్త చనిపోగా, తనకున్న ఆస్తిని కొడుకుల పేరుమీద చేయించింది. తర్వాత ఐదేళ్లు చిన్న కుమారుడు సత్తయ్య, మరో పదేళ్లు నాల్గో కుమారుడు లచ్చయ్య వద్ద కాలం వెల్లదీసింది. మిగతా కుమారులు మల్లయ్య, నారాయణ కుటుంబ సభ్యులు, గంగయ్య పట్టించుకోవడం లేదు. పలుమార్లు పంచాయితీలు నిర్వహించగా తల్లికి నెలకు రూ.5వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. పంచాయితీ జరిగి నెలలు గడుస్తున్నా మొదటి ముగ్గురు కుమారులు పట్టించు కోవడం లేదని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.
న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన తల్లి


