సుల్తానాబాద్రూరల్: విద్యార్థి దశలోనే రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన ఉండాలని డీసీపీ రాంరెడ్డి సూచించారు. భూపతిపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో బుధవారం అరైవ్–అలైన్ నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ మైనర్లు డ్రైవింగ్ చేయడం నేరమన్నారు. హెల్మెట్ లేకుండా, సీట్బెల్డ్ ధరించకుండా వాహనం నడుపురాదని తెలిపారు. నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చుని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై అశోక్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏంవీఐ, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సాగునీరు విడుదల
పెద్దపల్లి: శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ డీ–83, –86 ద్వారా జిల్లా వ్యవసాయ భూ ములకు ఎనిమిదో విడతగా బుధవారం సాగునీరు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు. యాసంగి పంటలకు ఇది చివరివిడత అని ఆయన అ న్నారు. మొక్కజొన్నతోపాటు ఆలస్యంగా సా గుచేసిన వరి పంటను కాపాడేందుకు చివరితడిని అందిస్తున్నామన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు చేరేలా ఇరిగేషన్ సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటారని తెలిపారు.
విద్యార్థి దశ నుంచే అవగాహన ఉండాలి
పెద్దపల్లిరూరల్: డ్రైవింగ్ సమయంలో రోడ్డు సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ట్రాఫిక్ సీఐ అనిల్కుమార్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్ చౌరస్తా వద్ద బుధవారం సీఐ ప్రవీణ్కుమార్ తదితర పోలీస్ సిబ్బందితో కలిసి విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. రోడ్డుభద్రత నియమాలపై సీఐ ప్రజలకు అవగాహన కల్పించారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు, మద్యం మత్తులో వాహనాలను అజాగ్రత్తగా నడపడంతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా వివరించారు. ఈ విషయపరిజ్ఞానాన్ని తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. బైక్ డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించాలని అన్నారు. కారు నడిపే సమయంలో సీట్బెల్ట్ ధరించేలా కుటుంబీకుల్లో అవగాహన పెంచే బాధ్యతను పిల్లలు తీసుకోవాలని ఆయన సూచించారు.
డిష్ ఆపరేటర్లకు నోటీసులు
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా వేళాడుతున్న ఇంటర్నెట్, డిష్ కేబుళ్లను వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు బుధవారం నిర్వాహకులకు నోటీసు లు జారీచేశారు. ముఖ్యంగా బీ– పవర్హౌస్ హనుమాన్ జంక్షన్ నుంచి గోదావరి వంతెన వరకు హెచ్కేఆర్ రాజీవ్ రహదారిపై స్తంభాల ఆధారంగా లాగిన ఇంటర్నెట్, డిష్ కేబుళ్లను వెంటనే తొలగించి ప్రత్యామ్నాయం చూసుకోవాలని కమిషనర్ అరుణశ్రీ కోరారు. తీగలను తొలగించడానికి రామగుండం నగరపాలక సంస్థ సన్నాహాలు చేస్తుందని తెలిపారు.
రేపు మెగా ఉద్యోగ మేళా
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోఈనెల 17న ప్రత్యేక జాబ్మేళా నిర్వహిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం తెలిపారు. దీనికోసం టాస్క్ రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని పేర్కొన్నారు. డిప్లొమా, ఐటీఐ, ఎంబీఏ పూర్తి చేసినవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు తగిన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలనిని సూచించారు. వివరాల కోసం పెద్దపల్లిలోని టాస్క్ రీజినల్ సెంటర్లో సంప్రదించాలని కలెక్టర్ కోరారు.
పెరిగిన పత్తి ధర
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో బుధవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.8,014 ధర పలికింది. కనిష్టంగా రూ.6,424గా, సగటు రూ.7,684గా ధర ఉందని మార్కెట్కమిటీ చైర్మన్ కూర మల్లారెద్డి, కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు.


