
కమ్ముకుంటున్న కాలుష్యం
● పర్యావరణానికి పెనుముప్పు ● వాయు, జలకాలుష్యంతోనూ ఇబ్బంది ● ఈఎస్ఐ ఆస్పత్రిపై కార్మికుల ఆశలు ● నేడు మంత్రులు ఉత్తమ్, తుమ్మల, దుద్దిళ్ల శ్రీధర్బాబు పర్యటన
గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతం అనేక సమస్యలతో సతమతమవుతోంది. ప్రధానంగా వాయు, జల, శబ్ద కాలుష్యం, నిరుగ్యోగంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవగాహన లేకచాలామంది రోడ్డు ప్రమాదాలకూ గురవుతున్నారు. వేలాదిమంది శాశ్వత అంగవైకల్యం పాలవుతున్నారు. నిరుద్యోగ యువత తప్పుదారి పడుతోంది. తక్కువ ధరకు వస్తున్న మత్తుతో విలువైన జీవితం నాశనం చేసుకుంటున్నారు. గంజాయిలాంటి మత్తుపదార్థాల బారినపడి కొందరు వ్యస నపరులుగా మారుతున్నారు. మరికొందరు నేరస్తులుగా, ఇంకొందరు మత్తుమందు సరఫరా చేస్తూ కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గిపోతున్నారు. ఆదివా రం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమా ముర్మూరు ఎత్తిపోతల ప్రారంభానికి వస్తున్న సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
జిల్లాలో కీలక పరిశ్రమలు ఇక్కడే..
సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ, ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్, కేశోరాం పరిశ్రమ లాంటి కీలక ఫ్యాక్టరీలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. వీటితోపాటే సమస్యలూ ఉన్నాయి. సింగరేణి బొగ్గు గనుల్లో నిల్వలు అడుగంటి పోవడం, భూగర్భ గను లు తగ్గిపోతుండడంతో కార్మికుల సంఖ్య శరవేగంగా పడిపోతోంది. ఇదే క్రమంలో కాంట్రాక్టు కార్మికు లు, ప్రైవేటీకరణ శరవేగంగా సాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి చేస్తోన్న ఎన్టీపీసీలోనూ కాంట్రాక్టు కార్మికు ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఎరువులు ఉత్పత్తి చేసే ఆర్ఎఫ్సీఎల్లోనూ పర్మినెంట్ కార్మికులకు బ దులు కాంట్రాక్టు కార్మికులతో ఉత్పత్తి చేస్తున్నారు.
ఆందోళన కలిగిస్తున్న పర్యావరణ కాలుష్యం
ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫీసీఎల్ విస్తరించిన పారిశ్రామిక ప్రాంతంలో వాయు, నీటి కాలుష్యం తీవ్రంగా ఉంది. సింగరేణి ప్రాంతంలోని రహదారులపై బొగ్గు ధూళి(కోల్డస్ట్) అధికంగా పేరుకుపోతోంది. బ్లాస్టింగ్ సమయంలో ఓసీపీల నుంచి దుమ్ము విపరీతంగా లేచి కాలనీలను ముంచెత్తుతోంది. దీంతో స్థానికులు శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు.
నిరుద్యోగ సమస్యతో సతమతం..
కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు, ప్రైవేట్ ఓబీల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు పెద్దగా లభిచడం లేదు. దీంతో స్థానిక యువత తీవ్ర నిరాశకు గురవుతోంది. కాంట్రాక్టు కార్మికులకు శ్రమకు తగిన జీతభత్యాలు అందడం లేదు. సౌకర్యాల కల్పనపై ఎవరూ దృష్టి సారించడంలేదు.
ఈఎస్ఐ ఆస్పత్రిపై ఆశలు..
రామగుండం కార్మిక క్షేత్రంలో ఈఎస్ఐ వందపడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. దీనికి సంబంధించిన స్థలాన్ని కూడా ఖరారు చేసినా.. కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంలో ఆలస్యం అవుతోంది. దీంతో కాంట్రాక్టు, భవన నిర్మాణ రంగ కార్మికులు, అల్పాదాయ వర్గాలకు ఈఎస్ఐ వైద్యసేవలు అందడం లేదు.
చాలీచాలని వేతనాలు..
రామగుండంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు భద్రత సిబ్బంది చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో దశాబ్దం క్రితం నియమించిన సుమారు 20 మంది భద్రతా సిబ్బందికి ఆశించిన వేతనాలు అందడం లేవు. ప్రతీనెలా రూ.10వేల వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ఈ సొమ్ము కూడా సకాలంలో చెల్లించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఎత్తిపోతల ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యే మంత్రులు తమ సమస్యలను ఆలకించాలని కార్మికులు కోరుతున్నారు.
ప్రధాన డిమాండ్లు..
● ఎన్టీపీసీ, సింగరేణి నుంచి రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎస్ఆర్ నిధులు కేటాయించాలి. అభివృద్ది పనులు వేగవంతం చేయాలి
● పర్యావరణ నియంత్రణ బోర్డు (పీసీబీ) పర్యవేక్షణ మళ్లీ ప్రారంభించాలి.
● స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలి.
● ఈఎస్ఐ, ప్రభుత్వ ఆస్పత్రుల విస్తరణ శరవేగంగా చేపట్టాలి.
మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు
రామగుండం: అంతర్గాం మండలం ముర్మూర్/బ్రాహ్మణపల్లి ఎత్తిపోతల పథకాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం ప్రారంభిస్తారు. ఈమేరకు చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూర్ శనివారం పర్యవేక్షించారు. అంతర్గాం జంక్షన్ కూడలిలో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలు, సలహాలిచ్చారు. తహసీల్దార్ రవీందర్ పటేల్, అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు ఉన్నారు.

కమ్ముకుంటున్న కాలుష్యం