● ఈ నెల 29న ఎస్ఎంసీ ఎన్నికలు
● చేతులెత్తే పద్ధతి ద్వారా అభ్యర్థుల ఎంపిక
● ఈ సారి ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఎన్నికలు
వీరఘట్టం: బడిలో ఎన్నికల సందడి మొదలు కానుంది. సర్కారు బడుల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు రెండేళ్లకు ఒకసారి విద్యాశాఖ ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) ఎన్నికలను నిర్వహిస్తుంది. రెండేళ్ల క్రితం ఎన్నికై న ఎస్ఎంసీల కాలపరిమితి ముగిసింది. దీంతో ఈ ఎన్నికలకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29న ఎన్నికల నిర్వహించేందుకు బుధవారం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈసారి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఎన్నికలు నిర్వహించాలని నిశ్చయించారు. ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉండకూదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల రాజకీయ నాయకులు చొరబడడంతో తగాదాలు జరిగాయి. మరి ఈసారి ఏ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారో చూడాలి. విద్యార్థుల తల్లిదండ్రులు చేతులెత్తే పద్ధతి ద్వారా ఎస్ఎంసీ చైర్మన్, వైఎస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఎన్నికలను జరిపించేందుకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రాథమిక, మోడల్ ప్రైమరీ, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, కేజీబీవీ ఇలా అన్ని మేనేజ్మెంట్లలో 1,604 సర్కారు బడులు ఉన్నాయి. అలాగే 98 ప్రైవేట్ పాఠశాలలతో కలిపి 1702 విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో 1,65,352 మంది విద్యార్థులు ఈ ఏడాది చదువుతున్నారు. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్లు లిస్టు(తల్లిదండ్రులు) జాబితా ప్రచురుణ చేస్తారు. 25న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు ఓటరు జాబితాపై అభ్యంతరాలు/ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3–4 గంటల మధ్యలో తుది ఓటరు జాబితా ప్రచురణ చేస్తారు. రాజకీయ జోక్యం లేకుండా 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు ఎస్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించి, మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య తొలి సమావేశాన్ని నిర్వహిస్తారు.
15 మండలాలకు ఎన్నికల
ప్రత్యేకాధికారులు..
ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో ఈ నెల 29న జరగనున్న ఎస్ఎంసీ ఎన్నికలను పర్యవేక్షించేందుకు విద్యాశాఖకు సంబంధించిన అధికారులను జిల్లాలోని 15 మండలాలకు నియమించారు. వీరు ప్రతి మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతారు. అలాగే ఇక్కడ జరిగే ఎన్నికల ప్రక్రియను ఉన్నతాధికారులకు నివేదిస్తారు.


