పార్వతీపురం రూరల్: కార్మికుల చెమట చుక్కలతో ఏర్పాటైన ఆర్టీసీని ప్రైవేట్ శక్తులకు ధారాదత్తం చేసే కుట్రలను ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.రాములు పిలుపునిచ్చారు. పార్వతీపురం డిపో వద్ద బుధవారం ఎస్డబ్ల్యూఎఫ్ 48వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఉద్యోగి ఎస్వీ రమణ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం డిపో కార్యదర్శి ఏఎస్టీ బాబు అధ్యక్షతన జరిగిన సభలో రాములు మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధనకు ఎస్డబ్ల్యూఎఫ్ దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. పినాకిల్ కంపెనీ పేరుతో యాజమాన్యం విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీ ఆస్తులను అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతాల్లో చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు సన్నాహాలు ఈ ప్రైవేటీకరణకు అద్దం పడుతున్నాయన్నారు. ఆర్టీసీ సిబ్బందితోనే బస్సులు నడిపేలా జేఏసీ ఆధ్వర్యంలో పోరాడి సాధించినప్పటికీ, పినాకిల్ కంపెనీ డిపోలను పరోక్షంగా స్వాధీనం చేసుకునే యోచనలో ఉందన్నారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాలని ఉద్ఘాటించారు. కార్మికులు అప్రమత్తంగా ఉండి, హక్కుల సాధనకు ముందడుగు వేయాలని సీఐటీయూ నాయకులు సూచించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డి వేణు, ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు, కోశాధికారి గొర్లి వెంకటరమణ, నాయకులు బి.సూరిబాబు, టి.వెంకటి, ఎంవీఏ నాయుడు, ఎస్ఏ రాజు, బీఎస్ రావు, జీఎస్ రావు, జీకే రావు, కేఈ నాయుడు, ఆర్వీ రావు తదితరులు పాల్గొన్నారు.
ఐక్య పోరాటాలతో ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
ఎస్డబ్ల్యూఎఫ్ ఆవిర్భావ సభలో రాష్ట్ర కార్యదర్శి రాములు


