● పాఠశాలల్లో పారదర్శకంగా నిర్వహించాలి
● డీఈఓ మాణిక్యం నాయుడు
విజయనగరం అర్బన్: జిల్లాలోని 1,767 ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)ల పునర్వ్యవస్థీకరణ ఎన్నికలను ఈ నెల 29న సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అఽధికారి, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త యూ.మాణిక్యం నాయుడు ఆదేశించారు. కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఎస్ఎంసీ మార్గదర్శకాలు–2026 ఆధారంగా రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ ఇదీ..
మంగళవారం ఉదయం 10గంటలకు ఎస్ఎంసీ సభ్యులు, చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ ఎన్నికల నిర్వహణనకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల నోటీసు బోర్డుపై ఓటర్ల జాబితా ప్రదర్శన. 25న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తుది ఓటర్ల జాబితా ఖరారు చేసి ప్రదర్శన. 29న ఉద యం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎస్ఎంసీ సభ్యుల ఎన్నికలు. మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్పర్సన్ ఎన్నిక, మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం. 3 నుంచి 3.30 గంటల వరకు నూతన ఎస్ఎంసీ తొలి సమావేశం నిర్వహించాలి. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా డిప్యూటీ ఈఓలు, సెక్టోరిల్ అధికారులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు అవసరమైన సమాచారం అందించాలని డీఈఓ సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. పాఠశాల పర్యవేక్షణ, మెరుగైన యాజమాన్యం, విద్యార్థులకు మెరుగైన వాతారణం కల్పించడంలో ఎస్ఎంసీల పాత్ర కీలకమని పేర్కొంటూ కమిటీల ఏర్పాటును ప్రోత్సహించాలని మండల స్థాయి విద్యాశాఖ ఆధికారులకు సూచించారు.


