● పారిశ్రామిక ప్రాజెక్టులకు సకాలంలో భూములు అప్పగించాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో వివిధ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా భూముల వివరాలు, అవార్డు ప్రక్రియ, పరిహారం చెల్లింపులు, పెండింగ్ అంశాలను పరిశీలించారు. నోటిఫికేషన్లు, సర్వేలు, రికార్డుల ధ్రువీకరణలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలోని అంబటివలస రిషి డెకర్స్, ఆంధ్ర కార్న్ ప్రొడక్ట్స్, కాపుసంబం ఎంఎస్ఎంఈ పార్కు, మరుపల్లి అన్షుమి ఇండస్ట్రియల్ పార్కు, శ్రీరాంపురం మై వీడు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్లాంట్, ఆకులకట్ట ఫుడ్ పార్కు తదితర ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిని సమీక్షించారు. కాపుశంభాం ఎంఎస్ఎంఈ పార్కు పనులకు సంబంధించి భూసేకరణ, పరిహారం చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్ఐపీబీ పరిధిలో రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రాజెక్టుకు భూమి అప్పగించి పనులు ప్రారంభించినందుకు అధికారులను అభినందించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.


