సీతంపేట: మండ జీఈఎస్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సీమల రాంగోపాల్పై ఎస్టీ కుల ధ్రువీకరణకు సంబంధించిన ఆరోపణలపై డీఎల్ఎస్సీ విచారణకు మంగళవారం అధికారులు గైర్హాజరైనట్టు సీతంపేట జేఏసీ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, బి.ఉమామహేశ్వరరావు తదితరులు ఆరోపించారు. ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు ఈ నెల 8న విచారణ చేస్తామని డీడీ ట్రైబుల్ వెల్ఫేర్ కార్యాలయం నుంచి ముందస్తుగా అధికారిక నోటీసులు వచ్చినా విచారణ జరగలేదన్నారు. విచారణ జరుగుతుందని నోటీసులు అందడంతో తమ వద్ద ఉన్న ఆధారాలు, పత్రాలతో పాటు మండలోని జీఈఎస్ పాఠశాలకు జేఏసీ నాయకులమంతా హాజరైనా అధికారులు ఎవ్వరూ విచారణకు రాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు. విచారణ జరుగుతుందనే కారణంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు సైతం స్కూల్కు గైర్హాజరయ్యారన్నారు. ఎంఈఓ నుంచి ఎటువంటి సెలవు అనుమతి తీసుకోలేదన్నారు. ఈ విషయంలో కలెక్టర్ చొరవ చూపి సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. వాస్తవాలు ప్రజలకు వివరించాలన్నారు. ఈ విషయమై ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర వద్ద ప్రస్తావించగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంగోపాల్ తిరుపతి వెళ్తానని పర్మిషన్ తీసుకున్నారన్నారు. దీంతో విచారణ ఈ నెల 17కి వాయిదా వేశామన్నారు. జేఏసీ నాయకులు కె.వినోద్కుమార్, ఎన్.రమేష్, బి.రామ్మోహన్రావు, టి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.


