న్యూస్రీల్
15 మండలాలతోనే...
జెడ్పీ పీఠం కోసం ఆశావహుల ఎదురుచూపులు
అదిగదిగో
జిల్లా పరిషత్తు!
సాక్షి, పార్వతీపురం మన్యం:
రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్లను పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జెడ్పీల స్థానంలో, కొత్తగా 28 జిల్లా ప్రజా పరిషత్లను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26కు పెంచడంతో పార్వతీపురం మన్యం జిల్లా 15 మండలాలతో కొత్తగా ఆవిర్భవించిన విషయం విదితమే. తర్వాత చంద్రబాబు ప్రభుత్వం మరో రెండు జిల్లాలను పెంచడంతో ఆ సంఖ్య 28కి చేరింది. మన్యం జిల్లా విడిపోయినప్పటికీ.. జిల్లా పరిషత్తు పరంగా ఉమ్మడి విజయనగరంలోనే ఇప్పటి వరకూ కొనసాగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం, సాలూరు, పార్వతీపురం జెడ్పీ సభ్యులు విజయనగరంలోనూ.. పాలకొండ సభ్యులు శ్రీకాకుళం జిల్లాలోనూ జెడ్పీ సమావేశాలకు హాజరవుతూ వస్తున్నారు. ఈ నెల 24వ తేదీతో ప్రస్తుత జెడ్పీ పాలక వర్గం పూర్తి కానుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో, కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రాతిపదికనే.. జిల్లా పరిషత్తులను కూడా విభజించింది.
కొత్తగా పోస్టులు..
కొత్తగా జిల్లా పరిషత్ కార్యాలయం మన్యంలో ఏర్పడనుంది. ప్రతి జెడ్పీకి ఒక అడ్మినిస్ట్రేటివ్ అధిపతి ఉండాలి. ఆ మేరకు కొత్తగా జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసింది. మినిస్టీరియల్, ఇతర సహాయక సిబ్బందిని ఆయా జిల్లాల్లోని మండలాల సంఖ్య, పని భారం ఆధారంగా కొత్తగా ఏర్పడే 28 జెడ్పీలకు హేతుబద్ధీకరించి కేటాయిస్తారు. ఇందులో భాగంగా మన్యం జిల్లా పరిషత్ కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాతే ఈ కొత్త జెడ్పీల ఏర్పాటు అమల్లోకి వస్తుంది. కొత్త జిల్లా ప్రజా పరిషత్ల ఏర్పాటు, పాలనాపరమైన బదిలీలు ఎలాంటి అవాంతరాలూ లేకుండా సాగేలా జిల్లా కలెక్టర్లు, ప్రస్తుత జెడ్పీ సీఈఓలు, ఎంపీపీ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తాజా ఉత్తర్వుల్లో ఆదేశించారు. కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పడటం వల్ల పలు అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా నిధులు విడుదలవుతాయని, దీనివల్ల జిల్లాకు సంబంధించి అనేక సమస్యలను విజయనగరంతో సంబంధం లేకుండా ఇక్కడే పరిష్కరించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, సాలూరు, మక్కువ, పాచిపెంట, కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, గరుగుబిల్లి, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాలతో కొత్తగా జిల్లా పరిషత్తు ఏర్పడనుంది. ఈ మండలాల్లోని మండల ప్రజా పరిషత్తులు సైతం ఇక్కడి జెడ్పీ కిందకే వస్తాయి. సాలూరు నియోజక వర్గంలోని ఉన్న మెంటాడ మండలం విజయనగరంలోనే ఉండనుంది.
ఇక మన్యం జిల్లా పరిషత్తు లాంఛనమే..
విజయనగరం నుంచి వేరు
15 మండలాలతో ఏర్పాటు.
మెంటాడ విజయనగరంలోనే...
ఈ నెల 24తో ముగియనున్న ప్రస్తుత పాలకవర్గం
పార్వతీపురం మన్యం జిల్లా స్వరూపం
కొత్తగా జిల్లా పరిషత్తు ఏర్పడటం వల్ల జెడ్పీ చైర్మన్ పోస్టు అదనంగా రానుంది. దీనిపై అన్ని పార్టీల్లోనూ ఆశావాహులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజర్వేషన్ ఖరారు కాగానే.. ఆశావాహుల జాబితా మరింత పెరగనుంది. కూటమి పార్టీల్లోని టీడీపీతో పాటు, బీజేపీ, జనసేన కూడా ఈ పదవి తమకే దక్కాలని అందులోని నేతలు ఎవరికి వారు ఆశలు పెట్టుకున్నారు.


