సీతంపేట: పసుపు పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు అనుసరిస్తున్న ఆధునిక సాగు పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఈ తరహా సాగు చేపట్టేందుకు వీలుగా ఇక్కడ నుంచి 40 మంది రైతులు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. వీరు వెళ్లిన బస్సును పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన రైతులు సాంప్రదాయ సాగు పద్ధతులతో పాటు ఆధునిక వ్యవసాయ విధానాలను అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడి సాంకేతిక పద్ధతులు, పంట యాజమాన్య విధానాలు, ఎక్కువ దిగుబడులకు రైతులు చేస్తున్న కృషి, సాగులో తీసుకుంటున్న జాగ్రత్తలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు. సీతంపేట, భామిని, కొత్తూరు, సారవకోట, మెళియాపుట్టి, పాతపట్నం, ఎల్ఎన్పేట తదితర మండలాలకు చెందిన 40 మంది రైతులు వెళ్లారు. ఐటీడీఏ పీహెచ్ఓ ఎస్.వి.గణేష్, ఏఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ఇజ్రాయెల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
● ఎస్సీ అభ్యర్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ
పార్వతీపురం రూరల్ : జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా పలు శిక్షణా కార్యక్రమాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సొసైటీ ఈడీ జి.గోపి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆదేశాలతో ఇజ్రాయెల్లో ‘హోమ్ టేక్ కేర్ గివర్’ ఉద్యోగాలకు ఎంపిక చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 25–45 ఏళ్ల వయసుండి జీడీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎం, నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులని, వీరికి ఇంగ్లిష్లో శిక్షణ ఇచ్చి ఎంపిక చేస్తారని తెలిపారు. నెలకు సుమారు రూ.1,99,770 వేతనం ఉంటుందని, ఆసక్తి గలవారు సెప్టెంబర్ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీటితో పాటు పదో తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన యువతకు కిసాన్ డ్రోన్ ఆపరేటర్, సోలార్ పీవీ ఇన్స్టాలర్, ఈవీ మెయింటెనెన్స్, మొబైల్ రిపేరింగ్ తదితర ఉపాధి ఆధారిత కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. అర్హులు //ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్ // వెబ్సైట్లోగానీ, విజయనగరంలోని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలోగానీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులను విద్య, కుల, ఆధార్, రైస్కార్డు నకళ్లను జతచేసి స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపాలి. ఇతర వివరాల కోసం 9652600967, 9642460838 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
వినాయక మండపాలకు
ఆన్లైన్లోనే అనుమతులు
పార్వతీపురం రూరల్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మండపాల ఏర్పాటును సులభతరం చేస్తూ పోలీస్ శాఖ ‘సింగిల్ విండో’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘గణేష్ ఉత్సవ్.నెట్’ వెబ్సైట్ ద్వారా ఒకే వేదికపై అనుమతులు పొందే వెసులుబాటు కల్పించినట్లు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు డీజీపీ ఆదేశాల మేరకు ఈ ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.
దరఖాస్తు ఇలా..
నిర్వాహకులు వెబ్సైట్లో తమ వివరాలు, విగ్రహం ఎత్తు, నిమజ్జన తేదీలను నమోదు చేయాలి. పోలీసుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం క్యూఆర్ కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ అవుతుంది. తనిఖీలకు వచ్చే అధికారుల కోసం దీనిని మండపం వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలి.
భక్తిభావం వెల్లివిరియాలి
రహదారులకు అడ్డంగా మండపాలు నిర్మించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించరాదని, డీజేలకు అనుమతి లేదని, సాధారణ స్పీకర్లను ఉద యం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే వినియోగించాలన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ఇసుక బస్తాలు, నీరు, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, బలవంతపు చందాలు వసూలు చేసినా, అశ్లీల నృత్యాలు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా చర్యలు తప్ప వని ఎస్పీ హెచ్చరించారు. రాత్రివేళల్లో నిర్వాహ కులు కాపలా ఉండటంతో పాటు, హుండీలను భద్రపరుచుకోవాలి. నిమజ్జన రూట్ మ్యాప్ ముందుగానే పోలీసులకు తెలిపి, వేడుకలు జరుపుకోవాలని సూచించారు.


