పార్వతీపురం రూరల్ : కలెక్టరేట్లో ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో శనివారం ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా చైర్మన్ గొట్టాపు శ్రీరామమూర్తి నేతృత్వంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ’హ్యాండ్ టు హ్యాండ్’ కార్యక్రమం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించాలని కోరారు. ముఖ్యమంత్రితో జరగనున్న చర్చలు సఫలం కావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని, కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల వివరాలను పే స్లిప్లలో స్పష్టంగా చూపాలని కోరారు. ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయడంతో పాటు పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి తగిన ప్రయోజనాలు కల్పించాలన్నారు.
ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ అసోసియేట్ చైర్మన్ ఎం.శ్రీనివాసరావు, కో–చైర్మన్ ఆర్వీ రమణమూర్తి, కోశాధికారి పి.ఎస్.ఎల్.కుమార్ తో పాటు వివిధ శాఖల ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.


