పార్వతీపురం: ఖరీఫ్–2026 సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ కార్యకలాపాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు, అధిక ధరలకు ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఎరువులు, విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.
ఈ–పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, రైతు సేవా కేంద్రాలతో క్షేత్రస్థాయిలో సాంకేతిక సలహాలు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి టి. భవానీ శంకరరావు పాల్గొన్నారు.


