● మడ్డువలస ప్రాజెక్టులో
మత్స్యకారుడి మృతి
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు పడి వంగర గ్రామానికి చెందిన మత్స్యకారుడు కంబాల గణేష్(40) బుధవారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. వేకువ జామున 5గంటల సమయంలో తన కుమారుడు ధనుంజయతో కలిసి పడవల సహాయంతో గణేష్ వెళ్లాడు. మొక్కతోట సమీపంలో ఉన్న ప్రాజెక్టు భాగంలో చేపల కోసం వేసే వలలను తీసే ప్రయత్నంలో పడవ నుంచి నీటిలోకి గణేష్ జారిపోయాడు. ఆ ప్రాంతంలో ఉన్న సహచర మత్స్యకారుడు యువరాజు చూసి కేకలు వేశాడు. లోతు ప్రాంతం కావడంతో అప్పటికే గణేష్ నీటిలో మునిగిపోయాడు. కొన్ని గంటల తరువాత ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు పెనుబోతు దుర్గారావు ఆధ్వర్యంలో ఇనుప గేలాలు, ఇసురు వలలతో పలువురు మత్స్యకారులను ప్రాజెక్టులోకి తీసుకువెళ్లి గాలింపు చేపట్టగా కాసేపటికి ఇనుప గేలాలకు తగిలి గణేష్ మృతదేహం లభ్యమైంది. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, సహచర మత్స్యకారులు అక్కడికి చేరుకుని భోరున విలపించారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్సీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ కె.రామ్మోహనరావు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, భార్య జ్యోతి ఉన్నారు.


