తోటపల్లి పాత రెగ్యులేటర్ దుస్థితి, ఆధునికీకరణ పనులు నిలిచిపోవడంపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు సమయానుకూలంగా సాగునీరు పొందడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తోటపల్లి పాత రెగ్యులేటర్ కాలువ వ్యవస్థలోని ఎడమ, కుడి ప్రధాన కాలువల హెడ్ స్లూయిస్ షట్టర్లు రెండేళ్లుగా సరిగా పనిచేయడం లేదన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదని వివరించారు. ఫలితంగా నీటి నియంత్రణ లోపిస్తోందని, కాలువ వ్యవస్థ దెబ్బతింటోందని చెప్పారు. ఎల్ఎంసీ హెడ్ స్లూయిస్కు దిగువ భాగంలో ఉన్న రక్షణ గోడలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ కీలక అడ్డంకులను, ముఖ్యంగా ప్రధాన హెడ్ స్లూయిస్ షట్టర్లు పునరిద్ధరించి పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవస్థ కింద ఉన్న ఆయకట్టుదారుల్లో ఎక్కువమంది చిన్న, సన్నకారు రైతులే అని.. సమస్యలను తొందరగా పరిష్కరించకపోతే పంట ఉత్పత్తి, రైతుల ఆర్థిక స్థితి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వివరించారు. సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, శాసనమండలి సభ్యులు గాదె శ్రీనివాసులు నాయుడు, పాలవలస విక్రాంత్, శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.


