వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నాం
పాచిపెంట: సీజన్ మారింది.. వానలు కురుస్తున్నాయి. గిరిజన గూడల్లోని తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయి. కలుషిత నీటిని తాగిన ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఏ గ్రామం చూసినా జ్వరపీడితులే దర్శనమిస్తున్నారు. విష జ్వరాలు విజంభిస్తుండడంతో అల్లాడిపోతున్నారు. ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పాచిపెంట మండలంలోని గరిసిగుడ్డి పంచాయతీ పరిధి తాడివలస, జిలుకువలస గ్రామాలకు చెందిన సుమారు 25 మంది గిరిజన ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఇటీవల గురువునాయుడుపేట పీహెచ్కి గరిసిగుడ్డి పంచాయతీ నుంచి అధిక సంఖ్యలో జ్వర పీడితులు రావడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయా గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ జ్వరాలు అదుపులోకి రాకపోవడంతో, వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 15 మందికి మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సాలూరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
కలుషిత నీరే దిక్కు...
గ్రామాల్లో మంచినీటి పథకం బోర్లు ఉన్నప్పటికీ సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీటి పథకం బోర్లు పనిచేయడం లేదు. దీంతో సమీప వాగుల నుంచి తీసుకువచ్చిన కలుషిత నీరు తాగి విషజ్వరాల బారిన పడుతున్నాం. అధికారులు స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని గరిసిగుడ్డి పంచాయతీ, జిలికవలస గ్రామ ప్రజలు కోరుతున్నారు.
జ్వరపీడిత గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నాం. మలేరియాతో బాధ పడుతూ సాలూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గరిసిగుడ్డి పంచాయతీకి చెందిన గిరిజనుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. మరో రెండు రోజుల్లో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తాం. – శివకుమార్,
నియోజకవర్గ హెల్త్ ప్రొగ్రాం ఆఫీసర్
ఒకే రోజు 495 ఓపీ నమోదు
132 మంది జ్వర పీడితులు
13 మందికి మలేరియా పాజిటివ్
సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రికి సోమవారం రోగుల తాకిడి ఎక్కువైంది. ఒకే రోజు 495 ఓపీ నమోదైంది. వీరిలో 132 మంది జ్వరంతో బాధపడుతుండగా, వైద్య పరీక్షల్లో 13 మందికి మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రోగులకు అవసరమైన వైద్యసేవలు అందించి మందులు పంపిణీ చేసినట్టు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. అవసరమైన వారిని ఇన్పేషెంట్లుగా ఉంచి సేవలు అందిస్తున్నామని చెప్పారు.
ఆస్పత్రులకు పెరుగుతున్న రోగులు
వైద్యపరీక్షల్లో మలేరియా కేసుల నిర్ధారణ
కలుషిత నీరే కారణ మంటున్న వైద్యులు


