రహదారి భద్రతకు ప్రాధాన్యం
● సిబ్బందితో ఎస్పీ దామోదర్ సెట్ కాన్ఫరెన్స్
విజయనగరం క్రైమ్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికలు రూపొందించాలని ట్రాఫిక్ సిబ్బందికి ఎస్పీ దామోదర్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లతో ఎస్పీ దామోదర్ ఆదివారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రహదారి భద్రత నియమాలను ప్రజలు తప్పక పాటించాలని ప్రమాదాల నియంత్రణకు సిబ్బంది భద్రతాచర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు,. వాహనదారులకు రహదారి భద్రతపట్ల అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులు వాహనం తాలూకా అన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి, ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలి. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను, ప్రమాదాలు జరిగినప్పటికీ స్వల్పగాయాలతో ఎలా ప్రాణాలతో భయటపడవచ్చునో ద్విచక్ర వాహనదారులకు వివరించాలని కోరారు. ప్రతిరోజూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, వాహన తనిఖీలు చేపట్టి, ప్రజలకు, వాహనదారులకు రహదారి భద్రత, మోటార్ వాహన చట్టం గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి, ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేయాలని చెప్పారు.
కాషనరీ బోర్బులు ఏర్పాటు చేయాలి
రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్కు ఇరువైపులా కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయడం, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లు, డ్రమ్ములు ఏర్పాటు చేసి, రాత్రి సమయాల్లో వాహనదారులకు కనిపించే విధంగా రేడియం స్టిక్కర్లు అతికించాలని సూచించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో భాగంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులపై 19,077 కేసులు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపే వారిపై 2370 కేసులు, మైనర్లు వాహనాలను నడిపిన కారణంగా వాహన యజమానులపై 1020 కేసులు, డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై 5510 కేసులు, గడిచిన 20 రోజులలో మద్యం తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలు శిక్ష పడిందన్నారు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 17,246 కేసులు నమోదు చేశామని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.


