పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష
● 4 నెలల్లోనే కోర్టు తీర్పు
విజయనగరం క్రైమ్: విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయికి శిక్ష పడేలా ఎస్సై శిరీష చార్జ్షీట్ తయారు చేసి..4 నెలల్లో ముద్దాయికి జైలు శిక్ష పడేలా చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..నగరంలోని గాజులరేగకు చెందిన బొండపల్లి సత్యారావు, (59) ఈ ఏడాది ఆగస్ట్ 18న తన మనుమరాలు బాలిక (6)పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగికదాడికి యత్నించాడు. వెంటనే బాలిక తల్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్సై శిరీష పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ ఆర్.గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణలో నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించడంతో పాటు, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు.
ఆరుగురు పేకాటరాయుళ్లపై కేసు నమోదు
వీరఘట్టం: మండలంలోని చిట్టపులివలస మామిడితోటలో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.కళాధర్ సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి ఇక్కడ పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడి చేసి పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.43,500లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై చెప్పారు.
విజయనగరం: ఇటీవల ముంబైలో కేంద్రప్రభుత్వం నిర్వహించిన ‘ఒలింపియాడ్ అమెచ్యూర్ ఇండియా‘ బాడీ బిల్డింగ్ పోటీల్లో దివ్యాంగుల విభాగానికి సంబంధించి జరిగిన పోటీలో జిల్లాకు చెందిన బాడీ బిల్డర్ ఈదుబిల్లి సూర్యనారాయణ గోల్డ్ మెడల్ సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని, ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ప్రశంశించారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్తో కలిసి సూర్యనారాయణ సోమవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పుట్టుకతోనే పోలియో బారిన పడిన సూర్యనారాయణ ఏ మాత్రం నిరాశ చెందకుండా బాడీ బిల్డింగ్ పట్ల తనకున్న ఆశక్తితో సాధన చేస్తూ అనేక రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో మెడల్స్ సాధిస్తూ అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించారు. వచ్చే ఏడాది మార్చి 6న అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న సూర్యనారాయణ అక్కడ కూడా ప్రతిభ చాటి అంతర్జాతీయస్థాయిలో జిల్లా కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచాలన్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తదితరులు పాల్గొన్నారు.


