● ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ
● మృతులు ఫిరంగిపురం మండలం
మునగపాడు వాసులు
● నరసరావుపేట సమీపంలో ఘటన
నరసరావుపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో అత్తా, కోడలు మృతిచెందిన ఘటన మంగళవారం గుంటూరు రోడ్డులో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. ఫిరంగిపురం మండలం మునగపాడుకు చెందిన చాట్ల మస్తాన్రావు, అతని తల్లి పార్వతమ్మ(50), భార్య నందిని(30)లు బ్యాంక్లో పని కోసం ద్విచక్రవాహనంపై నరసరావుపేటకు వచ్చారు. బ్యాంక్లో పని పూర్తిచేసుకుని తిరిగి స్వగ్రామం వెళ్లే క్రమంలో గుంటూరు రోడ్డు పాత ఆర్టీవో కార్యాలయం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని మొక్కజొన్న లోడుతో వినుకొండ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న పార్వతమ్మ, నందినిలు లారీ వెనుక చక్రాలు కింద పడిపోయారు. పార్వతమ్మ మీద నుంచి లారీ వెళ్లడంతో ఆమె మృతదేహం ఛిద్రమైంది. నందిని తీవ్రంగా గాయపడింది. ఆమెను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. ఈ ఘటనలో మస్తాన్రావు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


