గుంటూరు వెస్ట్ (క్రీడలు): స్థానిక బీఆర్ స్టేడియం ప్రాంగణంలో రూ.14 కోట్లతో నిర్మించనున్న బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు అంతస్తులుగా నిర్మిస్తున్న ఈ స్టేడియంలో తొమ్మిది బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్, టెన్నిస్ సహా ఆరు క్రీడా అంశాలలో వసతులు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. స్టేడియంలోని క్రికెట్ మైదానాన్ని ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి చేస్తామన్నారు. రూ.170 కోట్లతో మొత్తం స్టేడియం డీపీఆర్లు తయారు చేశారని వివరించారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, తూర్పు శాసన సభ్యులు నసీర్ అహ్మద్లు మాట్లాడారు. కమిషనర్ మయూర్అశోక్, ఎమ్మెల్సీ ఆలపాటి, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భరణి, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, డీఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్ పాల్గొన్నారు.
సత్తెనపల్లి: రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ వి.విజయ్కుమార్ రెడ్డి సూచనల మేరకు పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న పరివర్తన మానసిక దివ్యాంగుల పాఠశాలను గురువారం సత్తెనపల్లి సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్,)జె. సుజన్కుమార్ సందర్శించారు. ముందుగా అక్కడ ఉన్న విద్యార్థుల వసతి గృహం, వంటశాలను పరిశీలించారు. ఆహార నాణ్యతను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు బి.ఎల్. కోటేశ్వరరావు, గంటా వెంకటశివ, పారా లీగల్ వలంటీర్ షేక్ సుభాని, పాఠశాల నిర్వాహకుడు కొరబండి కిషోర్బాబు ఉన్నారు.
మంగళగిరి టౌన్: చినకాకానిలోని షైన్ ఆనంద శరణాలయానికి హైదరాబాద్ ఏఆర్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్ళం సుబ్బారెడ్డి రూ. 5.5 లక్షల విలువైన సోలార్ విద్యుత్ ప్యానళ్లను గురువారం అందజేశారు. సుబ్బారెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శరణాలయంపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్యానళ్లను ఆయన ప్రారంభించారు. బాలలకు అన్నదానం నిర్వహించారు. వైఎస్సార్సీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, వివిధ రంగాల ప్రముఖులు దొంతిరెడ్డి గాంధీ, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, రుక్మాంగరెడ్డి, వెంకటరామిరెడ్డి, లంకా శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్, నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.


