నరసరావుపేట: జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో సంబంధిత శాఖలు డీజీపీఎస్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లో అటవీ శాఖ అనుమతులపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అటవీ ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా పైపులైన్ల వంటి కార్యక్రమాలకు అధికారులకు సహకరించాలని జిల్లా అటవీ అధికారిని ఆదేశించారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు బోటింగ్ పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి కొండవీడు కోటపై నైట్ క్యాంపింగ్ సేవలు ప్రారంభించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహ, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రం ప్రారంభం
రొంపిచర్ల: మండలంలోని బుచ్చిబాపన్నపాలెం గ్రామంలో ఆధునికీకరించిన అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బుధవారం ప్రారంభించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. పశువైద్య శిబిరాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బాలికల ఆరోగ్య భద్రతకు నిర్వహిస్తున్న హెచ్పీఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ నెల 9వ తేదీన గ్రామంలో ఆరోగ్య దర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గ్రామంలోని పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆర్డీవో బాలకృష్ణ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవి, జిల్లా విద్యాధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు.


