కార్మికశాఖ సహాయ కమిషనర్ షేక్ మహబూబ్ సుభాని అధికారులతో కలిసి పలుచోట్ల దాడులు నిర్వహణ
నరసరావుపేట టౌన్: బాలలతో బిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు తప్పవని కార్మిక శాఖ సహాయ కమిషనర్ షేక్ మహబూబ్ సుభాని హెచ్చరించారు. బడి ఈడు పిల్లలు నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యాచన చేయడంపై ‘మసి మొగ్గలు’ శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఈ మేరకు అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. కార్మిక, మహిళ శిశు సంక్షేమ శాఖలతో పాటు ఎన్జీవోలతో కలిసి అధికారుల బృందం సంయుక్తంగా పట్టణంలోని పలు దుకాణాలు, హోటళ్లు ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. చిన్నారులతో బిక్షాటన చేయిస్తున్న పలువురిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలానే బిక్షాటన కొనసాగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. పిల్లల చేత బలవంతంగా బిక్షాటన చేయిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి సాంబశివారెడ్డి, డీసీపీవో శౌరీరాజు, సాంఘిక సంక్షేమ అధికారి సంతోష్, ఎన్జీవో ప్రతినిధులు రామాచంద్రరావు, ప్రేమ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


