విద్యుదాఘాతానికి మహిళా రైతు బలి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి మహిళా రైతు బలి

Mar 26 2026 7:49 AM | Updated on Mar 26 2026 7:49 AM

విద్యుదాఘాతానికి మహిళా రైతు బలి గల్లంతయిన విద్యార్థి మృతదేహం లభ్యం

క్వారీ గుంతలో కనుగొన్న సీఐ, గజ ఈతగాళ్ల బృందం మిన్నంటిన విద్యార్థి తల్లిదండ్రులు,బంధువుల రోదనలు

రొంపిచర్ల : మండలంలో రామిరెడ్డిపాలెం గ్రామంలో విద్యుత్‌ షాక్‌ గురై మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మహిళా రైతు, రొంపిచర్ల వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ డైరెక్టర్‌ మూలె కాశీ ఈశ్వరీ(40) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. ఆమె తన గేదెలకు నీరు పెడుతుండగా, అక్కడ ఉన్న విద్యుత్‌ తీగలు తగలటంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్ళగా మృతి చెందినట్లుగా నిర్ధారించారు. కాగా మృతురాలికి భర్త, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎల్‌. లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మేడికొండూరు: మండల పరిధిలోని పేరేచర్ల కై లాసగిరి సమీపంలో ఉన్న క్వారీ గుంతలో ఈతకు దిగి గల్లంతయిన విద్యార్థి మృతదేహం బుధవారం మేడికొండూరు పోలీసులు ఫైర్‌ సిబ్బందితో కలిసి బయటకు తీశారు. పలకలూరు గ్రామానికి చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థి చంద్రశేఖర్‌(16) తన స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో క్వారీ గుంతలో ఈతకు దిగి కనిపించకుండా పోయాడు. సంఘటన జరిగిన సమయం నుంచి మేడికొండూరు సీఐ మధుసూదన్‌ రావు తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం తాడేపల్లి నుంచి గజ ఈతగాళ్ళను రప్పించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్వారీ గుంతలలో రాళ్ళల్లో లోతుగా ఉన్న చంద్రశేఖర్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. మతుని తండ్రి బండారు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు సిఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు.

మిన్నంటిన రోదనలు..

పేరేచర్ల కై లాసగిరి సమీపంలో ఉన్న క్వారీలో విద్యార్థి గల్లంతైన సంఘటన ప్రదేశానికి విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. తండ్రి రాంబాబు ఆటో డ్రైవర్‌ గా పని చేస్తూ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివిస్తూ.. జీవనం సాగిస్తున్న ఈ తరుణంలో రెండవ కుమారుడు మృతి చెందటంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. తను ఆటోడ్రైవర్‌గా పనిచేసిన కుమారులు మాత్రం ఆ విధంగా ఉండకూడదని ఉన్నతంగా స్థిరపడేందుకు చదువే ఆధారంగా భార్యాభర్తలు కుమారుల కోసం కష్టపడుతూ ఉంటారని బంధువులు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement