విద్యార్థి, యువజన విభాగం నాయకులు
నరసరావుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులు అందరికీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినట్లుగా గ్లోబెల్ ప్రచారం చేస్తూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారని వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగ నాయకులు పేర్కొన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యువజన విభాగ జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్ మాట్లాడుతూ కేవలం 10,400 ఉద్యోగాలకు క్యాలెండర్ విడుదల చేయటం ద్వారా నిరుద్యోగుల సమస్యలు తీరవన్నారు. ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని, అసెంబ్లీ సమావేశాల్లో రెండేళ్లలో 6.20లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పారని, రెండేళ్లకు రూ.72వేలు చొప్పున, రూ.21,600 కోట్లు బాకీ పడ్డారని, వాటిని వెంటనే నిరుద్యోగులకు అందజేయాలని డిమాండ్ చేశారు.


