మిర్చి తోటలను పీకివేస్తున్నారంటూ రైతుల ఆందోళన
మాచర్ల: చేతికందివచ్చిన పంటలను తొక్కిస్తూ తీవ్రంగా నష్టపరుస్తున్న పైపులైను కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కొత్తపల్లి, బైరవునిపాడు, పాలపల్లి గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎన్సీసీ కంపెనీ నిర్మించే నీటి పైపుల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భూమిలో పైపులైను ఏర్పాటు సమయంలో ముందుగా రైతులకు సమాచారం ఇవ్వకుండా మిర్చి పంటలను నాశనం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ముందుగా రైతులకు సమాచారం ఇచ్చి పంట పరిశీలించి వారి అనుమతితో పనులు చేపట్టాల్సి ఉండగా, కొత్తపల్లి గ్రామ శివారులో రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏపుగా పెరిగిన మిర్చి పంటలను సైతం పీకి వేసి, పైపు పనులు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రామానికి చెందిన రైతు ఓరుగంటి జయప్రకాష్రెడ్డి, మరికొందరు రైతులకు సమాచారం ఇవ్వకుండా మిర్చిపంటలను యంత్రాలతో పెద్ద పెద్ద గుంతలు తీసి, పైపులైనులు ఏర్పాటు చేయడంతో పంట అంతా నష్టపోయినట్లు వాపోయారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులతో రైతులు ఇబ్బందులు పడుతుంటే, కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో మరింత నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి, మున్ముందు రైతులకు నష్టం జరుగకుండా చూడాలని కోరారు.


