● కొణతం స్వాతికి న్యాయం జరిగే వరకూ పోరాడుతాం ● కులం పేరుతో దూషించారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేస్తే ఈవ్ టీజింగ్ కేసు పెడతారా? ● డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసి రెండు వారాలైనా స్పందన లేకపోవడం విడ్డూరం ● న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం ● వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి
సత్తెనపల్లి: దళిత మహిళ, మున్సిపల్ కో–ఆప్షన్ మెంబర్ను అవమానించటమే కాక కులం పేరుతో దూషించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజక వర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, మాజీ మున్సిపల్ కో–ఆప్షన్ మెంబర్ కొణతం స్వాతి గృహంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని కొణతం స్వాతి ప్రశ్నిస్తే ఆమైపె కేసు పెట్టి మొబైల్ కూడా పోలీసులు సీజ్ చేశారన్నారు. అయినప్పటికీ ఆమె భయపడకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చెప్పటానికి కూడా వీలులేని భాషలో కౌన్సిలర్ స్థానంలో ఉన్న రంగిశెట్టి సుమన్కుమార్ పోస్ట్ పెట్టడం దారుణమన్నారు. ఎస్సీ మహిళ పట్ల కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు దిగజారి ప్రవర్తించడం గర్హనీయమన్నారు. దీనిపై మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు సైతం క్షమాపణ చెప్పాలని కోరినప్పటికీ క్షమాపణ చెప్పకపోగా కులం పేరుతో దూషించి చేతనైంది చేసుకోమని మాట్లాడటం అధికార అహంకారానికి నిదర్శనమన్నారు. దీనిపై కొణతం స్వాతి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేస్తే పోలీసులు ఈవ్టీజింగ్ కింద కేసు నమోదు చేశారన్నారు. దీంతో స్వాతి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి సత్తెనపల్లి డీఎస్పీకి, అక్కడ నుంచి సత్తెనపల్లిటౌన్ సీఐకి మార్చారే తప్ప న్యాయం చేయలేదన్నారు. చివరికి ఆ చట్టం వర్తించదని చెప్పడం జరిగిందన్నారు. దీనిపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే రెండు వారాలు గడిచినా ఇంతవరకు స్పందన లేదన్నారు.
● సంబంధం లేని కేసుల్లో మాజీమంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించారన్నారు. మహిళలను గౌరవించాల్సిందిపోయి అసభ్యకరంగా పోస్టులు పెట్టడమే కాక కులం పేరుతో దూషించినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. దళిత మహిళ కొణతం స్వాతికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, ఆమెకు న్యాయం జరిగే వరకూ దీనిపై పోరాడుతామన్నారు. లీగల్సెల్ను సంప్రదించి కోర్టు ద్వారా న్యాయపోరాటం కూడా చేయడం జరుగుతుందన్నారు.
● వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, సీనియర్ న్యాయవాది పక్కాల సూరిబాబు మాట్లాడుతూ ఎవరైనా పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే మొదట ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందన్నారు. విచారణలో వాస్తవం కాకపోతే కొట్టివేస్తారన్నారు. అలా చేయకుండా ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ రిపోర్టునే తలకిందులు చేయడం, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని మీపై ఫిర్యాదులు ఉన్నాయంటూ పోలీసులు కూర్చోబెట్టడం దురదృష్టకరమన్నారు. దళిత మహిళ బహిరంగంగా తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేస్తే సరైన విచారణ చేయకపోవడం సరైనది కాదన్నారు. దీనిపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామన్నారు.
● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలుకా జైపాల్ మాట్లాడుతూ కొణతం స్వాతికి న్యాయం జరిగే వరకూ ఎస్సీలంతా ఏకతాటిపైకి వచ్చి అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపడతామన్నారు. ఇప్పటికై నా రంగిశెట్టి సుమన్కుమార్ తక్షణమే కొణతం స్వాతికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే న్యాయపోరాటం తప్పదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు కోడిరెక్క దేవదాస్, కొణతం స్వాతిలు మాట్లాడారు. సమావేశంలో నాయకులు డాక్టర్ గీతా హాసంతి, చలంచర్ల సాంబశివరావు, రాయపాటి పురుషోత్తమరావు, లోక కళ్యాణి, కళ్ళం విజయభాస్కర్రెడ్డి, జొన్నలగడ్డ ఆనంద్, పెద్దింటి నాగేశ్వరరావు, సయ్యద్ గోరా, షేక్ జలీల్, యనమా సింగయ్య, కృపావరం, చావా రమేష్, సీతారాములు, జొన్నలగడ్డ సాగర్, జంగాల సంపత్, గుజ్జర్లపూడి సతీష్, బండి మల్లిఖార్జునరెడ్డి, జడా ప్రసాద్, కాటమల డేవిడ్, పొత్తూరు రామ కోటయ్య, అక్కేశ్వరరావు, రవితేజ, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


