తెనాలిటౌన్: స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్త స్థల ప్రాంగణంలో శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్టు ఆధ్వర్యంలో 39వ శనివారం శ్రీవేంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రీవేంకటేశ్వరస్వామికి, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి విశేష పూజలు చేశారు. శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనాబృందం ఆధ్వర్యంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని భక్తిశ్రద్ధలతో గీతా లు ఆలపించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాజాం మున్సిపల్ కమిషనర్ ఆకురాతి రామచంద్రరావు దంపతులు, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత, ట్రస్ట్ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు లక్కరాజు సాయికి ట్రస్టు నిర్వాహకులు స్వామి జ్ఞాపికను, వస్త్రాలను అందజేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు ఆర్వీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వేంకటేశ్వరస్వామి గానామృతం కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రం భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. భూదాన విరాళం అందజేసిన దాతలకు ట్రస్టు సభ్యులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణలు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్ఓ జమీర్బాషా
బాపట్ల: ప్రభుత్వం నిర్ణయించి ధరకు మించి గ్యాస్ సిలిండర్లు ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆర్.జమీర్ బాషా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 27 గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి 5377 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలను సీఎస్ డీటీలు, తహసీల్దార్లు తనిఖీ చేస్తారని తెలిపారు. జిల్లా కలెక్టరేట్, డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులు ఉంటే 94932 47765కు తెలియజేయాలని సూచించారు. అసత్య ప్రచారాలు నమ్మి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పట్టణనాలలో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులు తర్వాత మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని బుక్ చేసిన తర్వాత ఏడు రోజులలోగా సిలిండర్ వస్తుందన్నారు. గృహ అవసరాలు, సంక్షేమ వసతి గృహాలు, ఇతర అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో నిలుపుదల ఉండదని స్పష్టం చేశారు.


