
ఫిర్యాదులపై జీరో శ్రద్ధ
‘జీరో ఎఫ్ఐఆర్’కు మంగళం పాడుతున్న పోలీసులు
మాది కాదు పొమ్మంటూ..
● తమ ప్రాంతం కాదంటూ దాటవేస్తున్న వైనం ● పోలీసు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న బాధితులు ● కేసు నమోదు ఆలస్యంతో అందని న్యాయం
● ప్రతిపక్షాలపై మాత్రం యథేచ్ఛగా నమోదు.. వేధింపులు ● మండిపడుతున్న ప్రజలు
నరసరావుపేట టౌన్ : ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రవేశ పెట్టిన జీరో ఎఫ్ఐఆర్ విధానం రాష్ట్రంలో పూర్తిగా అమలుకు నోచుకోకుండా కాగితాలకే పరిమితం అవుతుంది. నేరం ఎక్కడ జరిగినా సమీపంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసిన తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ చేయాలి. అయితే ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ మెట్లు ఎక్కితే మాపరిధి కాదు.. అనే పదం పోలీసుల నుంచి బాధితులకు వినిపిస్తుంది. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ చివరకు నిరాశతో ఉన్నతాధికారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. ఫలితంగా న్యాయం పొందాల్సిన వారు నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. నేరస్తులు మాత్రం స్వేచ్ఛగా బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నారు. ఏదైనా నేరం ఎక్కడ జరిగిందనేది పక్కన పెడితే సమీపంలో ఏ పోలీస్ స్టేషన్లో నైనా బాధితులు వెళ్లి ఫిర్యాదు చేయగానే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంది. ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నా పోలీసులు విస్మరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
డాక్టర్కు ఎదురైన చేదు అనుభవం..
నంద్యాల జిల్లా సున్నిపెంటకు చెందిన డాక్టర్ బాడిస శ్రీనివాస్ ఈ ఏడాది మార్చి 18వ తేదీన విజయవాడ నుంచి శ్రీశైలం వెళుతూ నరసరావుపేటలో బస్సు మారాడు. స్వగ్రామంలో బస్సు దిగి బ్యాగ్ చూసుకోగా అందులో ఉండాల్సిన 320 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. వెంటనే వెళ్లి స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే అక్కడ పోలీసులు కేసు నమోదు చేసేందుకు తిరస్కరించారు. దీంతో నరసరావుపేట వచ్చి జరిగిన విష యం చెబితే .. సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఇలా నాలుగు నెలలపాటు ఎవరూ కేసు తీసుకోకపోవడంతో బాధితుడు ఉన్నతాధికారులను ఆశ్రయించా డు. తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి నరసరావుపేటకు బదిలీ చేశారు. ఈ లోగా దొంగలు మాత్రం చోరీ చేసిన సొత్తుతో జల్సా చేశారు.
‘యానిమేషన్’ లోనూ అదే తీరు
అదేవిధంగా విజయవాడ కేంద్రంగా యానిమేషన్ కేంద్రం ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నరసరావుపేటలో ఏజెంట్ల ద్వారా రూ.కోట్ల పెట్టుబడులు పెట్టించుకున్నారు. మోసపోయిన బాధితులు మొట్టమొదటి సారి నరసరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా విజయవాడ వెళ్లాలని సూచించారు. పల్నాడు జిల్లా ఎస్పీని కలసి విన్నవించుకున్నా ప్రయోజనం దక్కలేదు. ఇలా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ పై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
వైఎస్సార్ సీపీ నేతలపై ఒంటి కాలిపై...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒంటి కాలిపై దూకుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే సోషల్మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కూటమి నేతలు ఫిర్యాదు చేయగానే పోలీసులకు జీరో ఎఫ్ఐఆర్ గుర్తుకొస్తోంది. సంఘటనలకు పరిధితో సంబంధం లేకుండా స్థానికంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఒకే సంఘటనపై అనేక పోలీసు స్టేషన్లలో తప్పుడు కేసులు నమోదు చేసి ఇప్పటికే అక్రమంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలను జైలు పాలు చేశారు. కేవలం ప్రతిపక్షంపై కక్షసాధింపు కోసం మాత్రమే చట్టాలను అక్రమంగా ఉపయోగిస్తున్నారు. నష్టపోయిన బాధితులు స్థానిక పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగినా, ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో జిల్లా పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నా వారి సమస్యలకు పరిష్కారం దక్కడం లేదు. జీరో ఎఫ్ఐఆర్ ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రవేశపెట్టిన చట్టపరమైన సాధనం. కాని ప్రస్తుతం అది జీరో న్యాయం.. జీరో నమ్మకం అన్న పరిస్థితి తెచ్చిందని పలువురు బాధితులు వాపోతున్నారు.
కొందరు పోలీసుల అంతులేని నిర్లక్ష్యం జీరో ఎఫ్ఐఆర్ను వెక్కిరిస్తోంది. బాధితులకు సత్వర న్యాయం అందాలనే లక్ష్యాలకు తూట్లు పొడుస్తోంది. మా పరిధి కాదంటూ పక్కకు తప్పుకునే ఉదాసీనతకు జీరో ఎఫ్ఐఆర్ పేపరు పులిగా మాత్రమే మిగిలిపోతోంది. వేగవంతంగా బాధితులకు దక్కాల్సిన న్యాయం నెలల తరబడి నిరీక్షణలకే పరిమితమవుతోంది. ఇలా జీరో ఎఫ్ఐఆర్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక, అమలు చేయాల్సిన పోలీసు అధికారులు పట్టించుకోక బాధితులను జీరోలను చేస్తోంది.
నరసరావుపేటకు చెందిన ఓ మహిళా న్యాయవాది తన కుమార్తెతో కలిసి స్కూటీపై వెళుతుండగా మల్లమ్మ సెంటర్లో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో వెంటనే స్థానిక వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు సంఘటన జరిగిన ప్రాంతం తమ పరిధి కాదని, టూటౌన్ పరిధి అని సలహా ఇచ్చారు. వెంటనే టూటౌన్కు పీఎస్కు సమచారమివ్వగా... వారు స్పందిచలేదు. దీంతో సదరు న్యాయవాది ఈ విషయం సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ఇదేనా జీరో ఎఫ్ఐఆర్ అంటే అని నిలదీశారు.