
మాతృ మరణాలను అరికట్టాలి
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి
గుంటూరుమెడికల్: గుంటూరులోని కార్యాల యంలో సోమవారం డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అధ్యక్షతన సబ్ డిస్టిక్ లెవెల్ మాతృ మరణాల సమీక్ష సమావేశం జరిగింది. చేబ్రోలు, నిడమర్రు, మందపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జులై, ఆగస్టుల్లో జరిగిన మూడు మాతృ మరణాలపై సభ్యులు సమీక్షించారు. మరణానికి గల కారణాలను అధ్యయనం చేశారు. అందులో ఒకటి నివారించగలిగినది గాను, రెండు నివారించలేనివిగాను నిర్ధారించారు. సమావేశానికి హాజరైన ఆశా కార్యకర్తలు,ఆరోగ్య కార్యకర్తలు, సూపర్వైజర్లు, వైద్యాధికారులతో డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు. గర్భం దాల్చినప్పటి నుంచి తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, పౌష్టికాహారం పై అవగాహన కల్పించాలని చెప్పారు. తొలుత ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్బాబు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు , ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ అరుణ పాల్గొన్నారు.
లక్ష్మీపురం: చెడు వ్యసనాలకు అలవాటుపడి గంజాయి విక్రయిస్తూ, ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ఎనిమిది మంది అంతర్రాష్ట్ర దొంగలను అరండల్పేట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం బ్రాడీపేటలో కొంత మంది గుంపుగా చేరి గంజాయి విక్రయిస్తున్నట్లు అరండల్పేట సీఐ ఆరోగ్యరాజుకు సమాచారం వచ్చింది. హుటాహుటిన ఆయన ఎస్ఐ కృష్ణబాజీ, సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించగా కొంత మంది పరారయ్యారు. మిగిలిన వారిలో శ్రీనగర్కు చెందిన ఇంజాపల్లి మేరిబాబు, వెంగళరావునగర్కు చెందిన యద్దనపూడి దీనభాస్కర్, శారదా కాలనీకి చెందిన బడుగు ప్రభుకుమార్, ఒక మైనర్ బాలుడు, గోరంట్లకు చెందిన పణిదరపు అమరజ్యోతి, వెంగళరావు నగర్కు చెందిన ఏలూరి ఎలిజిబెత్రాజు, శివనాగ రాజు కాలనీకి చెందిన తూతిక అలియాస్ పాతూరి సైని, అలియాస్ హనీ, ఒడిశా రాష్ట్రంలోని పారిమ గ్రామానికి చెందిన పారిమ జోయామాజిలను అదుపులో తీసుకుని, కేసు నమోదు చేశారు. వీరి వద్ద గల 3.5 కేజీల గంజాయితో పాటు చోరీ చేసిన ద్విచక్ర వాహనాల ను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. వీరితోపాటు ఏసుబాబు, హర్ష సరిఫుద్దీన్, దుర్గాప్రసాద్, లక్ష్మణ్, అమరజ్యోతి, ఈశ్వర్, మురళి, వీరాస్వామిలు పరారీలో ఉన్నారు.