
2జీతో ఎలా జీ..!
● ఫోన్లలో లబ్ధిదారుల నమోదుకు అంగన్వాడీల తిప్పలు ● బాలింతలు, గర్భిణుల గుర్తింపునకు ఆపసోపాలు ● సరిగ్గా పని చేయని బాలసంజీవని, పోషణ ట్రాకర్ యాప్లు ● జిల్లాలో 19 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిధిలో 2,031 అంగన్వాడీ కేంద్రాలు
సత్తెనపల్లి: జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు యాప్లతో ఆప సోపాలు పడుతున్నారు. ముఖచిత్ర గుర్తింపునకు పడరాని పాట్లు పడుతున్నారు. యాప్లు పనిచేయక వాటితో కుస్తీలు పడుతున్నారు. ఈ బాధలు పడలేని అంగన్వాడీ కార్యకర్తలు యాప్ల భారం తగ్గించాలంటూ ఆందోళన చేపడుతున్నారు. లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీ చేయాలంటే తప్పనిసరిగా ముఖచిత్ర గుర్తింపు చేయాల్సిందే. అలా చేయకుండా ఆహార పదార్థాలను అందించలేరు. యాప్లు సరిగ్గా పని చేయకపోవడం, 2జీ ఫోన్లతో సకాలంలో ముఖచిత్ర గుర్తింపు ప్రక్రియ జరగక పోవడంతో ఇటు లబ్ధిదారులు, అటు అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు.
సక్రమంగా సాగని పంపిణీ
లబ్ధిదారులకు పోషణ ట్రాకర్, బాల సంజీవని అందించాలంటే రెండు యాప్లు నిర్వహించాలి. లబ్ధిదారు ఫేస్ రికగ్నైజ్ చేసి యాప్లో నమోదు చేయాలి. అయితే 2జీ ఫోన్లు వల్ల నెట్ సరిగా రాక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ గుర్తింపు చాలా సార్లు సక్సెస్ కావడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. ప్రభుత్వం బాల సంజీవని ద్వారా లబ్ధిదారులకు ముఖ గుర్తింపుతో బియ్యం ఇస్తోంది. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పోషణ ట్రేకర్ ద్వారానే లబ్ధిదారులను గుర్తించి సరుకులు ఇవ్వాలనే నిబంధనను తప్పనిసరి చేయడంతో కార్యకర్తలు ఈ రెండు యాప్ లను వినియోగించాల్సి వస్తోంది. ఇది కష్టంగా ఉందని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు.
అంగన్వాడీలు నిర్వహించే రికార్డులు
● లబ్ధిదారులకు అందించే ఆహార వినియోగం (ఎఫ్సీఆర్)
● పిల్లలు, గర్భిణులు, బాలింతలను నమోదు చేసే రికార్డులు (ఎస్ఎన్ఎన్)
● ప్రీ స్కూల్ అడ్మిన్ విద్యార్థుల వివరాల నమోదు
● పిల్లలకు అందించే టీకాలకు సంబంధించిన రిజిస్టర్
● విటమిన్–ఏ రికార్డు, రిఫరల్ సర్వీసెస్ గృహ సందర్శకుల రికార్డులు
● నెలవారీ ప్రాజెక్టు (ఎంటీఆర్)
● ఆయా అంగన్వాడీల పరిధిలోని హౌస్ హోల్డ్ సర్వే
● గ్రోత్ రికార్డ్, గ్రోత్ చార్టులు
● చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంబంధించి టేక్ హోం రేషన్ పంపిణీ రికార్డు
● స్టాఫ్ అడ్మిషన్ రిజిస్టర్ నిర్వహణ
ఈ రికార్డుల నిర్వహణ, యాప్ల భారంతో చిన్నారులకు ప్రాథమిక విద్య బోధించేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని అంగన్వాడీలు వాపోతున్నారు.
2జీ ఫోన్లతో తిప్పలు
పలు అంగన్వాడీ కేంద్రాల్లో నెట్వర్క్ కష్టాలు అధికంగా ఉండడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్స్ ర్యామ్ తక్కువగా ఉండడంతో తక్షణమే యాప్ స్పందించక తిప్పలు తప్పడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2జీ ఫోన్లు మా కొద్దు 5జీ ఫోన్లు ఇవ్వాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే విషయమై గత నెల 22న, ఈ నెల 4న సత్తెనపల్లిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన చేపట్టి 2జీ ఫోన్లు వెనక్కి ఇచ్చేశారు.

2జీతో ఎలా జీ..!