
డేటా సమీకరణలో ఆన్టాలజీల పాత్ర కీలకం
మద్రాస్ ఐఐటీ సీఎస్ఈ ప్రొఫెసర్ శ్రీనివాసకుమార్
చేబ్రోలు: వివిధ వనరుల నుంచి వచ్చిన డేటాను ఒకే ఫార్మాట్లో సమీకరించడానికి ఆన్టాలజీలు ఉపయోగపడతాయని మద్రాస్ ఐఐటీ సీఎస్ఈ ప్రొఫెసర్ పి.శ్రీనివాసకుమార్ అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నెట్వర్క్స్ అండ్ సాఫ్ట్ కంప్యూటింగ్’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ను శనివారం ముగిసింది. ప్రొఫెసర్ శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ ఏఐ సిస్టమ్లు ఒక నిర్దిష్ట పరిసరాన్ని అర్థం చేసుకోవడం, నిర్ణయం తీసుకోవడం లేదా సహాయపడే విధంగా రూపొందించడంలో ఆన్టాలజీలు కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు. భాషను అర్థం చేసుకోవడంలో ముఖ్యంగా తర్జుమా, ప్రశ్నల సమాధానాలు, చాట్బాట్ల అభివృద్ధిలో ఉపయోగపడతాయని తెలిపారు. వాతావరణం, ట్రాఫిక్, విద్యుత్ వినియోగం వంటి డేటాను తెలివిగా ప్రాసెస్ చేయడంలో కూడా వినియోగిస్తారని చెప్పారు. జైపూర్లోని ఎంఎన్ఐటీ– సీఎస్ఈ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ రమేష్బాబు బత్తుల మాట్లాడుతూ ఏఐ ఆధారిత వ్యవస్థలు బ్యాంకింగ్లో వినియోగదారుల ప్రవర్తనలను విశ్లేషించి అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించగలవని తెలిపారు. పౌరుల భద్రతను పెంచేలా సీసీ కెమెరాలు, ట్రాఫిక్ మానిటరింగ్, ఎమర్జెన్సీ సేవలను మరింత సమర్థంగా నడిపించడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఎన్ఐటీ– సిల్చార్ అసోసియేట్ ప్రొఫెసర్ కె.సుగన్య దేవి, ఎన్ఐటీ వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ యూ.ఎస్.ఎన్. రాజు పాల్గొన్నారు.