
వృద్ధులకు న్యాయ సహాయం అందిస్తాం
న్యాయమూర్తి లావణ్య
నరసరావుపేట ఈస్ట్: వేధింపులకు గురవుతున్న వయో వృద్ధుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని సీనియర్ సివిల్ జడ్జి ఎన్.లావణ్య తెలిపారు. ప్రపంచ వయో వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని ఆదివారం పెన్షనర్స్ భవన్లో నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ వయో వృద్ధులపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వృద్ధుల రక్షణకు చట్టం కల్పిస్తున్న సౌలభ్యాలను వివరించారు. సమావేశంలో పాల్గొన్న న్యాయసేవాధికారులు మాట్లాడుతూ వృద్ధుల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే తగిన న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నలుగురు వృద్ధులు తమ సమస్యలను న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు జి.చంద్రపాల్, కార్యదర్శి ఆర్.రామసుబ్బారావు పాల్గొన్నారు.
దళారుల మాటలు
నమ్మవద్దు
ఆర్డీ డాక్టర్ సుచిత్ర
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి జూన్లో జరగనున్న సాధారణ బదిలీలను అత్యంత పారదర్శంగా, అవకతవలకు తావు లేకుండా నిర్వహిస్తామని గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు (ఆర్డీ) డాక్టర్ కె.సుచిత్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పుకార్లు, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆమె సూచించారు. అవకతవకలకు పాల్పడే వారిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు అభ్యంతరాలు, ఫిర్యాదులను గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న మెడికల్ అండ్ హెల్త్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయంలో స్వయంగా తెలియజేస్తే, విచారించి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
దుర్గమ్మకు నృత్య నీరాజనం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో అనకాపల్లికి చెందిన శ్రీవెంకట సాయి డ్యాన్స్ అకాడమీకి చెందిన చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ఆదివారం సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై శిరీష పర్యవేక్షణలో 24 మంది చిన్నారులు పలు కీర్తనలకు నృత్యం ప్రదర్శించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన నృత్య ప్రదర్శన ఆద్యంతం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం నృత్య బృందానికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదాలను అందచేశారు.
కౌన్సెలింగ్పై ఫిర్యాదులను కమిటీ దృష్టికి తేవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్పై ఫిర్యాదులను ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ 22 ప్రకారం ముందుగా జిల్లా స్థాయి కమిటీ అయిన జిల్లా విద్యాశాఖాధికారికి అప్పీల్ చేయాలని ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయాల్సిన పక్షంలో రీజినల్ స్థాయిలో ఆర్జేడీ, అక్కడా సంతృప్తి చెందని పక్షంలో రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు అప్పీల్ చేయాలని ఆయన సూచించారు. ఇతర చట్టపరమైన పరిష్కారాల కోసం వెళ్లే ముందుగా, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలలోని అప్పీల్ నిబంధనలను విధిగా పాటించాలని ఆయన తెలిపారు. లేని పక్షంలో ఉపాధ్యాయులపై ఏపీ సీసీఏ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని లింగేశ్వరరెడ్డి హెచ్చరించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.40 అడుగుల వద్ద ఉంది. ఇది 137.5158 టీఎంసీలకు సమానం.

వృద్ధులకు న్యాయ సహాయం అందిస్తాం