టీడీపీ వారికే మళ్లీ మళ్లీ కండువాలు కప్పి.. | - | Sakshi
Sakshi News home page

టీడీపీ వారికే మళ్లీ మళ్లీ కండువాలు కప్పి..

Sep 5 2023 1:44 AM | Updated on Sep 5 2023 1:17 PM

గతంలో టీడీపీలో చేరిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు (వృత్తంలోని వ్యక్తి) - Sakshi

గతంలో టీడీపీలో చేరిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు (వృత్తంలోని వ్యక్తి)

రాజుపాలెం: తెలుగుదేశం పార్టీలోని వారికే మళ్లీ మళ్లీ కండువాలు కప్పి ఆపార్టీ నాయకులు చేస్తున్న ఆర్భాటాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టీడీపీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారాలు చేసి మభ్యపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబడుతున్నారు. రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యులు షేక్‌ గౌసియాబేగం నాగుల్‌మీరా, బలిజేపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యులు ఆలా అరుణకుమారి సుబ్బారావులను టీడీపీ ఇన్‌చార్జి కన్నా లక్ష్మీనారాయణ ఆర్భాటంగా పార్టీలో చేర్చుకున్నారు.

ఈ విషయం మండలంలో చర్చానీయాంశంగా మారింది. వివరాల్లోకి వె ళ్లితే ఆ ఇద్దరు మాజీ ఎంపీటీసీలు గత టీడీపీ ప్రభుత హయాంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సమక్షంలో టీడీపీలో చేరారు. నాటి నుంచి అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కాగా గత కొన్ని రోజులుగా టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి భారీగా చేరికలు పెరగడంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. ఎవ్వరు పార్టీలో చేరే వారు లేక తమ పార్టీలో వారికే కండువాలు కప్పి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. సోమవారం జరిగిన మాజీ ఎంపీటీసీ చేరిక విషయమై ప్రజలందరు ముక్కుమీద వేలేసుకుంటున్నారు.

ఈ విషయమై వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ వేపూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలో టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయిందన్నారు. తమ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేందుకు తమ పార్టీల వారినే తిరిగి చేర్చుకుని ఆర్భాటాలు చేస్తున్నారని విమర్శించారు. మండలంలోని ప్రజలందరికీ వాస్తవం తెలుసని, టీడీపీ మోసపూరిత చర్యలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement