జయపురం: వినాయక చవితి సందర్భంగా చందా ఇవ్వని కారణంగా మిఠాయి దుకాణంపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసినట్టు జయపురం పట్టణ పోలీసులు బుధవారం తెలిపారు. జయపురం మెయిన్ రోడ్డులోని ఒక మిఠాయి దుకాణం యజమానిని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు చందా కోసం డిమాండ్ చేశారు. అయితే చందా ఇవ్వకపోవడంతో అతను ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందిన కమిటీ సభ్యులు యజమానిపై దాడి చేయడంతోపాటు మిఠాయి దుకాణాన్ని ధ్వంసం చేశారు. దీనిపై సంబంధిత దుకాణం యజమాని జయపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఏఎస్సై బి.ఆర్.బారిక్ దర్యాప్తు జరిపారు. పట్టణ పోలీసు అధికారి ఉల్లాష్ చంద్రరౌత్ ఆదేశం మేరకు దర్యాప్తు జరిపిన ఏఎస్సై బారిక్ నిందితులను గుర్తించారు. స్థానిక కొత్త వీధి నాలుగో లైన్లో మంగళవారం సాయంత్రం ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఉలాస్ చంద్రరౌత్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో కొత్తవీధి నాలుగో లైన్కు చెందిన సుజిత్ కుమార్ హియాల్, కొత్తవీధి మూడవ లైన్ నివాసి కునాల్ నాయిక్, ఐదో లైన్కు చెందిన సురేంద్రబాగ్లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచినట్లు వెల్లడించారు.
నేటి నుంచి సేవా సంకల్ప పక్షోత్సవాలు
మల్కన్గిరి : బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు సేవా సంకల్ప పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బీజేపీ ఇన్చార్జి రమేష్ జెనా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దీపోత్సవంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులను భాగస్వామ్యం చేస్తామన్నారు. కార్యక్రమంలో మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి, నాయకులు పాల్గొన్నారు.
ఏడు అడుగుల విష సర్పం పట్టివేత
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ బొయిపరిగుడ గ్రామంలోని దుర్గా మందిర వీధిలో ప్రతిమ నాయిక్ ఇంట్లోకి ఏడు అడుగుల విష సర్పంచ్ బుధవారం చొరబడింది. పాముని చూసిన ఇంటివారు భయంతో గజగజ వణికిపోయారు. వెంటనే బొయిపరిగుడ అటవీ విభాగ అధికారికి, స్నేక్ క్యాచర్ డంబురు మఝిలకు సమాచారం ఇచ్చారు. దీంతో పాము ఉన్న ఇంటికి చేరుకున్న డొంబురు మఝి, అటవీ సిబ్బంది కొద్దిసేపు శ్రమించి పాముని పట్టుకొని అడవిలో సురక్షిత ప్రాంతంలో విడిచి పెట్టారు. వర్షా కాలం నేపథ్యంలో పాములు ఇళ్లలోకి చొరబడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ సిబ్బణది సూచించారు.
21 కేజీల గంజాయి స్వాధీనం
కొరాపుట్: గంజాయి అక్రమ రవాణాను కొరాపుట్ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం నందపూర్ సమితి పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలో బద్దేవత చౌక్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో కేరళ రాష్ట్రం పెరిచ్లమన్న పోలీస్ స్టేషన్ పరిధిలో పెడియా గ్రామానికి చెందిన ఉస్మాన్ అనన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతని బ్యాగులను తనిఖీ చేయగా 21 కేజీల గంజాయి పట్టుబడింది. వెంటనే పొలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి అనంతరం జైలుకు తరలించారు.


