పర్లాకిమిడి:
ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్లో యూత్ రెడ్క్రాస్ ఆధ్వర్యంలో నూతన వలంటీర్ల ప్రమాణ స్వీకారం, ఇండక్షన్ కార్యక్రమం సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. రెడ్క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యునాంట్ చిత్రపటం వద్ద వై.ఆర్.సీ. కౌన్సిలరు డా.సుశాంత కుమార్ పట్నాయిక్ జ్యోతి ప్రజ్వలన చేశారు. యువతలో సామాజిక బాధ్యత, సేవాభావం, మానవతా విలువలను పెంపొందించటంలో రెడ్క్రాస్ సంస్థ ముఖ్యపాత్రను పోషిస్తుందని డీన్ (స్టూడెంట్స్) సుశాంత కుమార్ పట్నాయిక్ తెలిపారు. అనంతరం డా.అనితా పాత్రో నూతన వాలంటీర్లతో వై.ఆర్.సీ. ప్రమాణ స్వీకారం చేయించారు. సెంచూరియన్ వర్శిటీ నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ ఎస్.ఎన్.సంధ్య, వై.ఆర్.సీ.జిల్లా కన్వీనరు సెక్రటరీ డా. బిప్లవ్ రంజన్ ప్రధాన్ మాట్లాడుతూ సేవాభావాన్ని జీవితంలో భాగంగా చేసుకుని సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. గజపతి జిల్లా వై.ఆర్.సీ. కోఆర్డినేటరు డా.ప్రదీప్ కుమార్ సారంగి, రిజిస్ట్రారు డా.అనితా పాత్రా, సి.యు.టి.యం. డీన్ డా.రితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


