శ్రీకాకుళం పాతబస్టాండ్: పరిశుభ్రతపై ప్రజల్లో వి
స్తృత చైతన్యం తేవడమే లక్ష్యంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా ‘స్వచ్ఛత హి సేవా – 2026’ పక్షోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో చెత్త విభజన, వర్షపు నీటి సంరక్షణ, పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై రోజువారీ ప్రణాళిక ప్రకారం ప్రచారం నిర్వహించాలని సూచించారు. అక్టోబర్ 1న ‘ఒక రోజు, ఒక గంట, అందరం కలిసి’ పిలుపుతో శ్రమదానం, అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా గ్రామసభలు, కౌన్సిల్ సమావేశాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సఫాయి మిత్రుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పాలనలో పారదర్శకత, ప్రభుత్వ సేవలందింపుపై ప్రజల అభిప్రాయం ఆధారంగా ఆయా విభాగాలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, నూతన పెన్షన్ల దరఖాస్తులు, ఇ–ఆఫీస్ వినియోగం, రీసర్వే, రేషన్ పంపిణీ, తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై సమీక్షించారు.


