భువనేశ్వర్: రాయగడ డివిజన్ పరిధిలోని రాయగడకు చెందిన క్యారేజ్–వ్యాగన్ గ్రేడ్ 1 టెక్నీషియన్ కె.నరేంద్రను తూర్పు కోస్తా రైల్వే భద్రతా పురస్కారంతో జనరల్ మేనేజరు సత్క రించారు. రైలు రవాణాలో సురక్షిత రైలు కార్యకలాపాలను సమయ స్ఫూర్తితో సకాలంలో గుర్తించి అప్రమత్తత చాటుకుని వృత్తిపరమైన నిబద్ధతకు ఉదాహరణగా నిలిచారని జనరల్ మేనేజరు అభినందించారు. ఈ ఏడాది జూన్ 29న రాయగడలో సరుకులతో నిండిన ఒక గూడ్స్ రైలును సాధారణ తనిఖీ చేస్తున్న సమయంలో కె.నరేంద్ర ఒక వ్యాగన్పై విరిగిన యోక్, దెబ్బతిన్న బ్యాక్ స్టాపర్ వెల్డింగ్ను గమనించారు. ఈ లోపం రైలు సురక్షిత కదలికకు ఆటంకం కలిగించగలదని గ్రహించిన ఆయన రైలు బయల్దేరడానికి ముందే లోపభూయిష్టమైన వ్యాగన్ను మార్చేందుకు తక్షణ ఏర్పాట్లు చేశారు. ఆయన సకాలంలో తీసుకున్న ఈ చర్య సంభవించబోయే భద్రతా ప్రమాదాన్ని నివారించి, రైలు సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడంలో సహాయపడిందని రైల్వే శాఖ అభినందించింది. ఆయన అంకిత భావం, అప్రమత్తత రైల్వే శాఖ బలమైన భద్రతా సంస్కృతిని ప్రతిబింబించింది. విశ్వసనీయమైన రైలు సురక్షిత, భద్రత, కార్యకలాపాలను వాస్తవ కార్యాచరణలో ఆచరించడం ఉద్యోగుల నిబద్ధతకు నిదర్శనమని తూర్పు కోస్తా రైల్వే ప్రశంసించింది.
వసతి గృహంలోకి భల్లూకం!
● ఆందోళనలో విద్యార్థులు
జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి నువాగాం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల వసతి గృహ పరిసరాల్లోకి ఎలుగుబంటి చొరబడింది. దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా సాయంత్రం వేళ ఎలుగుబంటి ప్రహరీ దూకి వసతి గృహం ఆవరణ లోనికి వస్తుందని విద్యార్థులు, ప్రజలు చెబుతున్నారు. భల్లూకాన్ని చూస్తున్న విద్యార్థులు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లడిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కొంతమంది మీడియా, సోషల్ మీడి యా ప్రతినిధులు, యువకులు ఎలుగుబంటి ఫొటోలు తీసి వైరల్ చేస్తున్నారు. వసతి గృహం ఆవరణలోకి ఎలుగుబంటి వస్తుండడంతో విద్యార్థులు సాయంత్రం నుంచి ఉదయం వరకూ గదుల్లోనే భయంతో గడుపుతున్నారు. ఇక్కడ 400 మంది విద్యార్థులు ఉంటున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు వసతి గృహం పరిసరాలను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు, సిబ్బందికి సూచించారు. ఆరుబయట తిరగవద్దని హెచ్చరించారు. అధికారులు తక్షణమే ఎలుగుబంటిని పట్టుకొని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
గంజాయి స్వాధీనం
కొరాపుట్: అక్రమ గంజాయిని మాచ్ఖండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి మాచ్ఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్ర సరిహద్దు డీ–డ్యాం ప్రాంతంలో గంజాయి రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో మాచ్ఖండ్ ఐఐసీ కులమణి బురడా నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఒడిశా నుండి ఆంధ్ర బోర్డర్ వైపు వేగంగా ఒక కారు వెళ్తున్నట్లు గుర్తించి దాన్ని అడ్డగించారు. అందులో 60 కిలోల గంజాయి పట్టుబడింది. కారులో ఉన్న నిందితులు సునాబెడా పోలీస్ స్టేషన్ పరిధిలో చువాగాంకి చెందిన ఈశ్వర్ సునా, భరణీ పుట్కి చెందిన యెగేష్ హంతాల్, గనేల్ గ్రామానికి చెందిన సదాన్ చడ్డాని అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.


