రాయగడ: ఝార్సుగుడ జిల్లాలో మహిళను తుపాకీతో బెదిరించి కాల్పులకు యత్నించిన కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడగా మరో నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనలొ పోలీసులు అక్రమ తుపాకీలు, పేలని తూటాలు, ఖాళీ కార్ర్టిడ్జ్లు పల్సర్ ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్తో పాటు ఇతర కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఝార్సుగుడ జిల్లా ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర ఈ ఘటనకు సంబంధించి విలేకర్లకు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఈ నెల 26 వ తేదీన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓరియంట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని చెప్పారు. గత విభేదాల కారణంగా అంకిత్ ఘోస్ ,వకీల్ రాయ్ అనే ఇద్దరు నిందితులు ఆమె ఇంటికి వెళ్లి తుపాకీతో బెదిరిస్తూ కాల్పులకు ప్రయత్నించగా, ఆయుధం పనిచేయకపోవడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో దర్యాప్తు ప్రారంభించడంతో 26 వ తేదీ అర్ధరాత్రి బ్రజరాజ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓపీఎం ఘాట్ సమీపంలో నిదితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులపై వారు ఎదురు కాల్పులు జరపడంతో పలు మార్లు లొంగిపోవాల్సిందిగా నిందితులను పోలీసులు హెచ్చరించినప్పటికీ వారు కాల్పులను విరమించకపోవడంతో ఆత్మరక్షణ హక్కు మేరకు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అంకిత్ ఘోస్ కుడి తొడలొ బుల్లెట్ గాయం కావడంతో అతడిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఝార్సుగుడ జిల్లా ప్రధాన ఆస్పత్రికి నిందితుడిని తరలించారు. మరో నిందితుడు వకీల్ రాయ్ ఫరారయ్యాడని ఎస్పీ వివరించారు.


