రాయగడ: వాస్తవాలు తెలుసుకోకుండా పిల్లల్ని ఎత్తుకెళ్లేవారని అనుమానించి ఇద్దరు యువతీ, యువకులపై దాడి చేసిన ఘటన అమానుషమని ఎస్పీ రాజ్ ప్రసాద్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించి శనివారం రాత్రి స్థానిక డీపీవో కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఘటనను చాలా సెన్సేషన్గా పరిగణలోకి తీసుకుని స్వయంగా తానే దర్యాప్తు చేస్తున్నానని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఇప్పటికే 20 మందిని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని చెప్పారు. ఘటనలో భాగంగా యువతిపై దాడి చేసే సమయంలో తీసిన వీడియోలు వైరల్ అయ్యిందని అన్నారు. యువతిపై దాడి చేసే సమయంలో ఆమైపె కొందరు అమానుషంగా ప్రవర్తించి మహిళ అని చూడకుండా, వివస్త్రను చేసే విధంగా వీడియోలు ప్రచారం కావడం చాలా విచారకరమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం చట్టపరమైన నేరమని హెచ్చరించారు. దీనిపై సైబర్ క్రైం శాఖ సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇటువంటి తరహా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ కేసులో నిందితులుగా ఉండే ఎవరినీ విడిచిపెట్టేది లేదని, వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని తెలిపారు.


