రాయగడ: పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ, అటవీ విస్తరణ లక్ష్యంగా జిల్లాలోని కుంభికోట పంచాయతీ ఉదయపూర్ గ్రామంలో సాలార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6 వేల సీడ్బాల్స్ తయారీ కార్యక్రమం విజయవంతమయ్యింది. వర్షాకాలంలో వీటిని కొండ ప్రాంతాలు, బంజరు భూములు, అడవి పరిసర ప్రాంతాల్లో విసరడం ద్వారా మొక్కలు మొలకెత్తే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సాలార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ పండ మాట్లాడుతూ.. ప్రకృతి మనిషికి జీవనాధారమైన గాలి, నీరు ఆహారాన్ని అందిస్తుందని, అందువల్ల ప్రకృతి సంరక్షణ ప్రతీ ఒక్కరి నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం సీడ్ బాల్స్ తయారీ విధానం, వాటి ఉపయోగాలు, వర్షాకాలంలో వాటిని ఎలా వినియోగించాలో గ్రామస్తులకు వివరించారు. అదేవిధంగా స్థానిక స్వయం ప్రతిపత్తి కళాశాలకు చెందిన ఆరుగురు ఇంటర్న్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సిబ్బంది స్వర్ణలత పాణిగ్రహి, దీప్తిమయి నాయక్, రంజన్ మండంగి, నర్సి కులసిక తదితరులు పాల్గొన్నారు.


